హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలోని మరో ఐదు ఎంటెక్ కోర్సులకు గుర్తింపు ఇవ్వాలని ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) మంగళవారం నిర్ణయించింది. గత జనవరిలో పీజీ (ఎంటెక్)లో నాలుగు కోర్సులకు గుర్తింపు ఇవ్వడంతో ప్రస్తుతం పీజీలో తొమ్మిది కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు లభించినట్టయింది.
పీజీలో ఒకేసారి ఇలా తొమ్మిది రకాల కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు దక్కడం ఓయూ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఏడాది 11 కోర్సులలో తొమ్మిది కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు లభించిందని ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఈ గుర్తింపు 2022-23 నుంచి 2024-25 వరకు కొనసాగుతుందని అన్నారు. 2025 జూన్ 30 వరకు తొమ్మిది కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు ఉంటుందని చెప్పారు. మార్చిలో ఎన్బీఏ బృందం ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ను సందర్శించి, వసతి సదుపాయాలు, ఫ్యాకల్టీ వంటి అన్నిరకాల విషయాలను తనిఖీ చేసి రిపోర్టు తయారు చేసింది. ఎన్బీఏ కమిటీ సానుకూల నిర్ణయం తీసుకుని.. ఆ సమాచారాన్ని మంగళవారం ఈమెయిల్ ద్వారా తెలియజేసిందని ప్రిన్సిపల్ తెలిపారు.
ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలలో తొమ్మిది రకాల పీజీ (ఎంటెక్) కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు దక్కడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో సానుకూలత లభిస్తుందని ప్రిన్సిపల్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ముఖ్యంగా టెక్విప్ ద్వారా నిధులు రావడం, ప్రాజెక్టులకు అవకాశం లభించడం, వరల్డ్ బ్యాంకు ఫండింగ్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్స్ ఇంటర్న్షిప్, ఎన్ఆర్ఆర్ఎఫ్ ర్యాంకు, కాలేజీ ప్రమాణాలు, ఓయూ న్యాక్ గుర్తింపు మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. పైగా యూజీసీ గుర్తింపు కూడా లభిస్తుంది. తొమ్మిది రకాల పీజీ కోర్సులకు ఏకకాలంలో ఎన్బీఏ గుర్తింపు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషిచేసిన కాలేజీ ఫ్యాకల్టీకి, విద్యార్థులకు ప్రిన్సిపల్ ధన్యవాదాలు తెలియజేశారు.