మహబూబ్ నగర్ : యాసంగి వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 20 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేసి రైతులు ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు చెల్లించేలా నిర్ణయించారన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కోటి ఎకరాలకు పైగా పంట పండించిన దాఖలాలే లేవని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో మాత్రమే పూర్తిస్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, కరోనా ఉన్నప్పటికీ కూడా వరి ధాన్యం కొనుగోలు ఆపలేదని చెప్పారు.
గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఊర్లో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొంటామని తెలిపారు. గత సంవత్సరం వచ్చిన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో ఇబ్బందులను అధిగమించేందుకు వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలన్నారు.
గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారిని, ట్రాన్స్పోర్ట్ సమస్య రాకుండా చూడాలని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులను ఆదేశించార రైస్ మిల్లర్లు సహకరించకపోతే బ్లాక్ లిస్టులో ఉంచాలన్నారు. రైస్ మిల్లులు సామర్థ్యం పూర్తి వివరాలను సమర్పించాలని అన్నారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సంఘం అధ్యక్షులు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..