మధిర, మే 11: కేంద్రమంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడైన సంజయ్ కొడుకు భగీరథ్ను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు. ఈ పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ తన కేంద్రమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తన కొడుకును కాపాడుకుంటున్నారని ఆరోపించారు.
పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మధిరలోని బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్.. ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడడమే కాకుండా బాధితురాలి కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. ప్రధాని సభ వద్ద ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు తేల్చిచెప్పినందునే పోలీసులు తప్పనిసరి పరిస్థితిలో స్పందించి కేసు నమోదు చేశారని అన్నారు.
పోక్సో కేసు నమోదైనప్పటికీ నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడిపై కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంజయ్కు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లు కన్పిస్తోందని ఆరోపించారు.కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు చిత్తూరు నాగేశ్వరరావు, పల్లబోతుల వెంకటేశ్వరరావు, సయ్యద్ ఇక్బాల్, ధరావత్ మాధవి, చావా వేణుబాబు, వంకాయలపాటి నాగేశ్వరరావు, కటికల సత్యనారాయణ రెడ్డి, ఆళ్ల నాగబాబు, పాలవంచ రామారావు, బానోతు కృష్ణ పాల్గొన్నారు.