అమరచింత, ఆగస్టు 9 : గత పదేళ్లలో ఎప్పుడు చూడని సాగునీటి ఇబ్బందులు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కనిపిస్తున్నాయని జూరాల ఎడమకాల్వ అయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా ప్రవాహం ఉన్నంత వరకే సాగునీటి విడుదల ఉంటుందని ప్రకటన చేస్తూ శనివారం అర్ధ రాత్రి నుంచి జూరాల ఎడమ కాల్వకు నీటి విడుదల నిలిపివేశారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలు కాగా స్పందించిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి జూరాల ఎడమ కాల్వకు సాగునీటి విడుదల చేయాలని ప్రాజెక్టుపై ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
దీంతో గంటల వ్యవధిలో దిగివచ్చిన కాంగ్రెస్ సర్కారు, ఇరిగేషన్ అధికారులు మోటర్ల వద్ద ఉండే లష్కర్లతో ఆదివారం సాయంత్రం సాగునీటిని విడుదల చేయించింది. ఈసందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పెత్తనం అంతా ఆంద్రవాళ్లదే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. జూరాల ఎడమ కాల్వకు ఎప్పుడుపడితే అప్పుడు సాగునీటిని విడుదల నిలిపివేస్తామని అంటే ఉరుకునేది లేదని, అయకట్టు రైతులకు వానకాలం పంట చివరివరకు సాగునీరు వి డుదల చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతుల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.