న్యూఢిల్లీ : ఉపాధి అవకాశాలు అందుబాటులో లేక యువత అల్లాడుతుంటే మోదీ సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఖాళీగా పడిఉన్న లక్షల పోస్టులను (Jobs) భర్తీ చేసేందుకు కూడా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు పది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేల్లోనే అత్యధికంగా 2.93 లక్షల ఖాళీలున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్లో వెల్లడించింది.
ఖాళీగా ఉన్న పోస్టులను సకాలంలో భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు సూచించిందని, ప్రభుత్వం చేపట్టిన రోజ్గార్ మేళాలతో ఉపాధి కల్పన ఊపందుకోనుందని సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఆయా మంత్రిత్వ శాఖల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియని చెప్పారు.
ఇక రైల్వేలతో పాటు రక్షణ శాఖలో (సివిల్) 1.43 లక్షలు, హోం శాఖలో 90,050 పోస్టులు, రెవెన్యూ శాఖలో 80,243 పోస్టులు, ఆడిట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 25,934 పోస్టులు, అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో 9460 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఉద్యోగాలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మరో లిఖితపూర్వక సమాధానంలో మంత్రి వివరించారు.
Read More
Meta | మాస్ లేఆఫ్స్ అనంతరం బోనస్ చెల్లింపుల్లో కోత
Layoffs | భారత్లో ఇంజనీరింగ్ టీంపై గిట్హబ్ వేటు