Mayawati : బీఎస్పీ అధినేత్రి (BSP Chief) మాయవతి (Mayavati).. రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ (Ashok Siddarth) ను పార్టీ నుంచి బహిష్కరించారు. అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్ రణధీర్ సింగ్ బేనీవాల్ (Randhir Singh Beniwal) పై కూడా బహిష్కరణ వేటు వేశారు. పార్టీ మార్గదర్శకాలను పలుమార్లు ఉల్లంఘించడం, క్రమశిక్షణారాహిత్యం కారణాలతో వారిని తొలగించారు. ఎక్స్ వేదికగా బీఎస్పీ అధినేత్రి ఈ విషయాలను వెల్లడించారు. సిద్ధార్థ్ను గతంలో ఒకసారి బహిష్కరించిన విషయాన్ని బీఎస్పీ చీఫ్ మాయావతి ఎక్స్ వేదికగా వెల్లడించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల పంపిణీ విషయంలో రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్తో సమన్వయం చేసుకోనందుకు నాడు ఆయనను బహిష్కరించామని మాయ తెలిపారు. మరోసారి ఇలాంటివి జరగవని సిద్ధార్థ్ హామీ ఇవ్వడంతో పార్టీలోకి మళ్లీ అనుమతించామని అన్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి పలు బాధ్యతలను అప్పగించామని చెప్పారు. కానీ కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో బీఎస్పీ మార్గదర్శకాలను సిద్ధార్థ్ మళ్లీ ఉల్లంఘిచారని మాయావతి చెప్పారు. దాంతో ఇప్పుడు ఆయనను పార్టీకి చెందిన అన్ని బాధ్యతల నుంచి తప్పించామని తెలిపారు.
అయితే సిద్ధార్థ్ మళ్లీ యూపీకి తిరిగొస్తున్నారన్న వార్తలు వ్యాపించాయని, పార్టీలో కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించేందుకు కుట్ర జరిగిందని మాయావతి ఆరోపించారు. కాబట్టి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తక్షణం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పారు. మాయవతి మేనల్లుడు ఆకాశ్ ఆనంద్కు సిద్ధార్థ్ మామ అవుతాడు. కాగా, పార్టీ కోఆర్డినేటర్ బేనీవాల్కు కూడా క్రమశిక్షణ లేని కారణంగా పార్టీ నుంచి బహిష్కరించామని బీఎస్పీ చీఫ్ మాయావతి చెప్పారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ బాధ్యతలను గతంలో ఆయనకు అప్పగించామని అన్నారు.
కానీ ఆయన పార్టీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శిస్తున్నట్టు తరచూ ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. కాబట్టి పార్టీ ప్రయోజనాలను కాపాడుకునేందుకు బేనీవాల్ను కూడా బహిష్కరించామని చెప్పారు.