రామగిరి, సెప్టెంబర్ 17 : బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిని వ్యక్తికి నల్లగొండ జిల్లా ఫోక్సో న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 26 ఏప్రిల్ 2023 న నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ పై జరిగిన అత్యాచారం ఘటనలో తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన నిందితుడు, కారు డ్రైవర్ ఎస్.కె.ఖయ్యూంపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సదరు వ్యక్తిని దోషిగా తేల్చింది. దీంతో న్యాయమూర్తి విశ్వనాధ్ కులకర్ణి దిలీప్ రావు పోక్సో కేసులో 23 ఏళ్ల కారాగార శిక్షతో పాటు SC/ST చట్టం కింద జీవిత ఖైదు/యావజీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయి. అలాగే రూ.3 వేల జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.7 లక్షల పరిహారాన్ని న్యాయస్థానం ప్రకటించింది. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్.సంపత్, ఐ.ఓ లు గా డి.ఎస్.పి వీ.నరసింహారెడ్డి, ఎం శ్రీధర్ రెడ్డి, ప్రస్తుత ఎస్.హెచ్ ఓ సైదా బాబు, ప్రస్తుత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, సీడీఓ సుమన్, భరోసా లిగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితర అధికారులు కేసు విచారణలో తోడ్పాటు అందించారు.