ఊట్కూర్ : గణేష్ ఉత్సవాలు ( Ganesh festivals) , నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతం గా, మతసామరస్యంతో నిర్వహించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ( SP Dr. Vineeth ) అన్నారు. ఊట్కూర్ రైతువేదికలో గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులు, యువతతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శోభాయాత్రల్లో నిబంధనలు ఉల్లంఘించి డీజే (DJ ) లు ఏర్పాటు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు, నారాయణపేట ఆర్డీవో ఉత్తర్వుల మేరకు డీజేలపై నిషేధం అమల్లో ఉందని తెలిపారు. డీజేలకు బదులుగా సంప్రదాయ వాయిద్యాలు, సాంస్కృతి క కార్యక్రమాలను ప్రోత్సహించాలని సూచించారు. నిమజ్జన సమయంలో భక్తులు, యువత అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, క్రేన్లు వంటి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేసే ఉట్కూరు చెరువును ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువులో నీటిమట్టం తక్కువగా ఉన్నందున పెద్ద విగ్రహాల నిమజ్జనం మక్తల్ ట్యాంక్ లేదా కృష్ణా నదిలో నిమజ్జనం చేసేలా ప్రత్యామ్నా య ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
మసీదుల వద్ద బందోబస్తు అనంతరం పోలీస్స్టేషన్లో ముస్లిం మతపెద్దలతో ఎస్పీ శాంతి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐ రామ్లాల్, ఆర్ఐ విజయ్భాస్కర్, ఎస్సైలు రమేష్, భాగ్యలక్ష్మిరెడ్డి, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీవో పావని, మతపెద్దలు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.