చండీగఢ్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ల కోసం పంజాబ్ రైతులు రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో చేపట్టారు. పలు రైల్వే స్టేషన్ల వద్ద నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లు నిలిచిపోగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (Punjab Farmers Rail Roko) గురువారం కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో పంజాబ్ రైతులు రాష్ట్రవ్యాప్తంగా ‘రైల్ రోకో’ ఆందోళన చేపట్టారు. దీంతో పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
కాగా, అమృత్సర్లోని దేవిదాస్పురా వద్ద రైతులు ధర్నా చేశారు. నిరసనకారుల ఆందోళనల నేపథ్యంలో బియాస్ రైల్వే స్టేషన్లో శతాబ్ది ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. గురుదాస్పూర్, మోగా, ఫిరోజ్పూర్, సంగ్రూర్లలో కూడా రైలు పట్టాలపై నిరసన చేశారు. మాలావాలా రైల్వే స్టేషన్ వద్ద ఫిరోజ్పూర్-జలంధర్ రైల్వే లైన్ను కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ దిగ్బంధించింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
మరోవైపు ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, దానివల్ల రైతులకు కలిగే పరిణామాలపై స్పష్టత ఇవ్వాలని పంజాబ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సవరణ చట్టంపై ప్రభుత్వ వైఖరి, ప్రతిపాదిత విత్తన చట్టం, సహకార కేంద్రాల రద్దుపై స్పష్టత కోరుతున్నారు. శంభు-ఖనౌరి రైతు ఆందోళన సమయంలో జరిగిన సుమారు రూ. 3.77 కోట్ల నష్టానికి సంబంధించిన పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే రైతులతో చర్చలు జరిపేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కిసాన్ మజ్దూర్ మోర్చా సీనియర్ నాయకుడు సర్వన్ సింగ్ పాంధర్, ఇతర రైతు ప్రతినిధులు, ఐజీ బోర్డర్ రేంజ్, డిప్యూటీ కమిషనర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే ఈ ఆందోళన ఉద్దేశమని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పంజాబ్ విభాగం అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సభ్రా తెలిపారు.