Musi River | నల్లగొండ : నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నది నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు యొక్క 3, 4, 5, 6, 8, 10, 12 క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తినట్లు అధికారులు తెలిపారు. గేట్లను ఎత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో పోచంపల్లి- బీబీనగర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు బీబీనగర్, భువనగిరికి వెళ్లేందుకు పెద్ద రావులపల్లి నుండి చుట్టూ తిరిగి వెళుతున్నారు. మూసీ ఉధృతితో అధికారులు ఇరు వైపులా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. అధికారులు పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తoగా ఉండాలని, మూసీ పరివాహక ప్రాంతాల్లో సంచరించవద్దని మండల తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఆర్ఐ గుత్తా వెంకట్ రెడ్డి సూచించారు.