హైదరాబాద్: ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని (Musi River) విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీలో వరద ఉధృతి పెరగడంతో ముసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి నీరు వెళ్తున్నది. దీంతో అధికారులు బ్రిడ్జిని మూసివేశారు. వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత నెల రోజుల్లో ముసారంబాగ్ బ్రిడ్జి పైనుంచి నీరు వెళ్లడం ఇది నాలుగోసారి.
కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరు వద్ద లోలెవల్ బ్రిడ్జి పైనుంచి వరద పారుతున్నది. దీంతో జూలూరు-రుద్రవెల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు.