PM Modi | బరేలీ (యూపీ), ఏప్రిల్ 25 : కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలతో విరుచుకుపడ్డారు. గురువారం బరేలి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ‘మీ ఇంటిలో ఇద్దరికి ఉద్యోగాలుంటే..ఒక ఉద్యోగాన్ని కాంగ్రెస్ లాక్కొని, ‘వనరులపై మొదటి హక్కు’ ఉన్నవారికి అప్పగిస్తుంది’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. యాదవ్, కుష్వాహా, మౌర్య, గుర్జర్, రాజ్భర్, తెలి, పాల్ వర్గాలతో సహా వెనుకబడిన తరగతులను ప్రస్తావిస్తూ, ‘మీ రిజర్వేషన్ హక్కును కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు లాక్కోకుండా నేను అడ్డుకుంటా. ఇది మోదీ గ్యారంటీ. వెనుకబడిన, దళిత కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఉద్యోగం చేస్తే, ఒకరి ఉద్యోగాన్ని తీసివేసి.. దేశ వనరులపై మొదటి హక్కు ఉన్నవారికి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇస్తాయి’ అంటూ ఓటర్లను హెచ్చరించారు.
యూపీలోని షాజహాన్పూర్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, బుజ్జగింపు రాజకీయాలు ఇద్దరు యువరాజుల్ని ఒక్కదగ్గరికి చేసిందని రాహుల్గాంధీ, అఖిలేశ్ యాదవ్ను ఉద్దేశించి అన్నారు. మధ్యప్రదేశ్లోని మోరెనాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, ‘1985లో రద్దు చేసిన వారసత్వపు పన్ను చట్టాన్ని మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఈ చట్టాన్ని మళ్లీ తెస్తే అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతారు’ అని అన్నారు. ‘ముస్లిం వర్గాల ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తున్నది. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటం చట్ట విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. ఓబీసీ హక్కులను లాక్కోవడానికి కాంగ్రెస్ తమ అభిమాన ఓటు బ్యాంక్ను బలోపేతం చేసేందుకు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనుకుంటున్నది. మతపరమైన బుజ్జగింపుతో అధికారాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నది’ అని అన్నారు.