Harish Rao | గజ్వేల్, నర్సాపూర్, మే 6: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిడితే, తెలంగాణను తిట్టినట్టేనని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్లో మీడియాతో, బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా సిద్దిపేట జిల్లా ములుగు, కుకునూర్పల్లి, కొండపాకలో రోడ్షోల్లో పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను తిట్టడం రేవంత్రెడ్డికి మంచిదా? కేసీఆర్ వయసెంత? నీ వయసెంత? కేసీఆర్ లేకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా? ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులు ఒత్తే నువ్వు బీఆర్ఎస్ను విమర్శించటమా?’ అని రేవంత్పై ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా కీర్తిని ఆకాశానికి ఎత్తిన కేసీఆర్ను తిట్టడం సరికాదని, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేస్తే, ఆ జిల్లాలను రద్దు చేస్తామనటం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. జిల్లాల రద్దును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతుబంధు ఇస్తావా? చస్తావా? అని కేసీఆర్ బస్ వేసుకొని తిరుగుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దెబ్బకు ఇప్పుడు రైతుబంధు వేస్తున్నరని, పంట నష్టం ఇస్తున్నరని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వేవ్లు నడుస్తున్నాయని, ఒకటి హీట్ వేవ్ కాగా.. మరోటి బీఆర్ఎస్ వేవ్ అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. మట్టి పనికైనా, ఇంటి పనికైనా మనోడు ఉండాలని, అందుకు మనకు కేసీఆర్ రక్ష అని అన్నారు.
మాయమాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవెర్చకుండా మోసం చేసిందని, నాలుగు నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిందని హరీశ్ ఆరోపించారు. రేవంత్రెడ్డి ఐదు హామీలు అమలు చేశామంటే, రాహుల్గాంధీ ఆరు చేశామంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను అమలు చేశామని రాహుల్గాంధీ ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో చెప్పారని, ఏ గ్రామంలో అమలైందో చెప్పాలని ప్రశ్నించారు. ఏ గ్రామంలో అయినా ఆరు గ్యారెంటీలు అమలైతే బీఆర్ఎస్ ఓట్లు అడగదని, ఆరు గ్యారెంటీలు అమలుకాని ఊళ్లలో కాంగ్రెస్ ఓట్లు అడగవద్దని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను ఎక్కడ అమలు చేశారో రాహుల్గాంధీ చూపించాలని డిమాండ్ చేశారు. హస్తం పార్టీ రాకతో దొంగ కరెంట్ మొదలైందని, ఆ పార్టీ వచ్చుడేమో కానీ ఉన్న కల్యాణలక్ష్మి రావటం లేదని, తులం బంగారం లేదని, చూస్తుంటే బంగారం ధర కొండెక్కిందని విమర్శించారు. ఈ గవర్నమెంట్ అంతా రివర్స్ గేర్లా ఉన్నదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ తప్పుచేస్తే రాహుల్ సరిదిద్దాలని, రాహులే తప్పు చేస్తే ఎవరు సరిదిద్దుతారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్రెడ్డితో అపాయం పొంచి ఉన్నదని వ్యాఖ్యానించారు. ఈ తప్పులను సరిదిద్దే బాధ్యత తెలంగాణ ఓటర్లపై ఉన్నదని, కేసీఆర్ నిలబెట్టిన వెంకట్రామిరెడ్డిని గెలిపించుకొందామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, ఆ పార్టీలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు అని హరీశ్ మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండా సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. పదేండ్లలో బీజేపీ, ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేశాయే చెప్పలేక పోతున్నాయని, అందుకే మతాలు, రాజ్యాంగం, రిజర్వేషన్లు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. ఓవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలతో ప్రజల గుండెలు మండుతున్నాయని వెల్లడించారు. ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు బీఆర్ఎస్ అభ్యర్థిపై సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టేనని అన్నారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గోపి, సత్యంగౌడ్, వెంకట్రెడ్డి, శివకుమార్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.