హైదరాబాద్ : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగానే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు. తెలంగాణ చారిత్రక సంపద అయిన రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషకరమన్నారు.
రాష్ట్ర వారసత్వ, చారిత్రక, సాంస్కృతి, సాంప్రదాయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. తెలంగాణ మహనీయలను, సాహితీవేత్తలను, చరిత్రకారులను, సామాజిక వేత్తలను, కవులను, కళలను, కళకారులను గౌరవించి వారి జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 70 ఏళ్లలో తెలంగాణలోని కళలు, చరిత్ర, సంస్కృతిని నిర్లక్ష్యం చేశారన్నారు.
అందరికీ గర్వకారణం
అద్భుతమైన శిల్పకళాఖండం రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం అందరికీ గర్వకారణమన్నారు. కాకతీయుల ఘనచరిత్రకు శిల్పకళా నైపుణ్యానికి, కళలకు, సాంకేతిక, నైపుణ్యానికి నిదర్శనం రామప్ప దేవాలయం అన్నారు. దేవాలయానికి ఎప్పుడో యునెస్కో గుర్తింపు రావాల్సిందని, ఉమ్మడి రాష్ట్రంలో జరుగని ఎన్నో అద్భుతాలు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. త్వరలోనే తెలంగాణ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారబోతుందన్నారు.
ప్రపంచ పర్యాటకులు ఆలయాన్ని సందర్శించడంతో ఆ స్థాయిలో హోటల్ పరిశ్రమ, ట్రావెలింగ్, గైడింగ్ తదితర తరంగాల్లో యువతకు ఎన్నో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు రాబోతున్నాయన్నారు. తాజ్ మహల్కు ప్రపంచ వారసత్వ గుర్తింపు మూలంగా ఆగ్రా పట్టణం పూర్తిగా పర్యాటక రంగంపై ఆధారపడిందన్నారు. ఐరోపాలోని ఇటలీ, ఫ్రాన్స్, ఈజిప్ట్, స్పెయిన్, రోమ్, పారిస్ పట్టణాలు టూరిజంపైనే ఆధారపడి ఉన్నాయన్నారు.
హైదరాబాద్కు తలమానికం కేబుల్ బ్రిడ్జి
ప్రపంచమే అబ్బుర పడే ఎన్నో గొప్ప కట్టడాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. వెయ్యి స్థంభాల గుడి, గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహి టూంబ్స్, పిల్లలమర్రి లాంటి అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలున్నాయన్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్కే తలమానికమన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు పాపారావు, పాండురంగారావు, ఎంపీలు బండా ప్రకాశ్కు ధన్యవాదాలు తెలిపారు.
యునెస్కో గుర్తింపు రావడంలో విశేష కృషి చేసిన రష్యాతో పాటు పలు దేశాల దౌత్యవేత్తలు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎంఎల్సీ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, పురావస్తు శాఖ ఉప సంచాలకులు నారాయణ, రాములు నాయక్, మాధవి, రాజు పాల్గొన్నారు.