హైదరాబాద్ : కొవిడ్ నేపథ్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేకసార్లు సమీక్షలు చేశారని తెలిపారు. ఇవాళ ఉదయం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ. 20 వేల కోట్లకు పౌరసరఫరాల శాఖకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చామన్నారు. రైతులకు బాసటగా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు అని చెప్పారు.
సాగు పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలన్నారు. ఒకరిని చూసి ఒకరు వరి సాగు చేయకపోవడం మంచిదన్నారు. వరి సన్నరకాలే సాగు చేయాలని సూచించారు. వానాకాలంలో పత్తి, కందిసాగు విస్తీర్ణం పెంచాలన్నారు. యాసంగిలో 52.79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.
కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. ఎఫ్సీఐ 80 లక్షల మెట్రిక్ టన్నులు, మిల్లర్లు 20 లక్షల మెట్రిక్ టన్నులు, విత్తనాల కంపెనీలు 10 లక్షల మెట్రిక్ టన్నులు, పొరుగు రాష్ర్టాల మిల్లర్లు 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. తేమ శాతం, తాలు నిబంధనలకు లోబడి ధాన్యం తేవాలన్నారు.
పత్తి సాగు విస్తీర్ణం 70 నుంచి 75 లక్షల ఎకరాలకు పెరగాలన్నారు. తెలంగాణ పత్తికి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. రాష్ర్టంలో వేరుశనగ పంట విస్తీర్ణం పెంచాలని రైతులకు సూచించారు. రైతులకు రాష్ర్టంలో విత్తనాల లభ్యతకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ర్టంలో ప్రస్తుతం 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల సామర్థ్యంతో గోదాములు ఉన్నాయి. భవిష్యత్లో అన్ని జిల్లా కేంద్రాల్లో గోదాములు నిర్మాణం చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..