హైదరాబాద్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ భారీ మెజార్టీతో విజయం సాధించి చరిత్ర సృష్టించబోతున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి చేశామన్నారు. నాలుగేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయానికి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టామన్నారు. విద్యుత్ లోటు నుంచి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్ది కేసీఆర్ చరిత్ర సృష్టించారని కేటీఆర్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్కే పరిమితం అయ్యాడని బీజేపీ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఒక వేళ ఫామ్ హౌజ్కే పరిమితం అయితే నాలుగేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా పూర్తయింది? రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన కరెంట్ ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిలకడ లేకుండా పని చేస్తున్నారని బీజేపీ గొప్పలు చెప్పుకుంటోంది. అలా అయితే, ద్రవ్యోల్బణం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఎందుకు పెరిగింది. నిరుద్యోగం ఎందుకు పెరిగిందని కేటీఆర్ ప్రశ్నించారు.