Jupally Krishna Rao | మహబూబ్నగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? అనే ప్రశ్నకు ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు అవుననే బలం చేకూరుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కు చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొల్లాపూర్లోని పెంట్లవెల్లి లో ఇటీవల కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘రేమద్దులలో (సర్పంచులు, ఎంపీటీసీలు) అందరూ వాళ్లే.. అక్కడ 900 మెజారిటీ వచ్చింది.
చిన్నంబావిలో ఎంపీపీలు, జడ్పీటీసీలు వాళ్లే.. అధికారులు వాళ్లే.. పెత్తనం కూడా వాళ్లదే. అక్కడ కూడా సుమారు 300-400 మెజారిటీ వచ్చింది. పెంట్లవెల్లిలో ఏం తక్కువ చేసినం, మరి ఎందుకు ఓట్లు రాలే’ అంటూ కార్యకర్తలపై మండిపడ్డారు. మధ్యలో కార్యకర్తలు, నాయకులు కలుగజేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటే.. ‘వినండి.. వినండి.. అన్ని చోట్ల కంటే ఎక్కువగా పెంట్లవెల్లిలోనే ఖర్చుపెట్టిన. ఇక్కడ పెట్టిన ఖర్చు ఎక్కడా పెట్టలేదు. ఎందుకు ఓట్లు రాలేదు?’ అంటూ కార్యకర్తలను ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టిందని ఆ మంత్రి మాటలతో స్పష్టమవుతుందని విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. సదరు మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేటిజన్లు సోషల్మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.