సిద్దిపేట అర్బన్, మే 8: ప్రజలు అధికారం ఇచ్చిన రాష్ర్టాల్లో ప్రభుత్వాలను నిలబెట్టుకోలేని అసమర్థ నాయకుడు రాహుల్గాంధీ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవాచేశారు. రాహుల్గాంధీ ఏ హోదాలో వరంగల్ డిక్లరేషన్ ఇచ్చారో అర్థం కావడంలేదని మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో డిక్లరేషన్లో ప్రకటించిన పథకాలు అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే గతమేనని చెప్పారు. పంజాబ్లో అధికారం నిలబెట్టుకోలేక పోయిందని, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతయిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడలేని అసమర్థ నాయకుడు రాహుల్గాంధీ, అసమర్థ కాంగ్రెస్ తెలంగాణలో ఏం ఉద్ధరిస్తారని ఎద్దేవా చేశారు.
అబద్ధాల బీజేపీలో సమన్వయ లోపం
అబద్ధాలు చెప్పడంలో బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని హరీశ్రావు దెప్పిపొడిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, తెలంగాణ దేశానికి గ్రోత్ ఇంజిన్ అని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంసిస్తే.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాత్రం ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదంటూ అబద్ధాలు చెప్పాడని వివరించారు. నడ్డా రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్టును చదివారని, ఇది పార్టీలో సమన్వయ లోపానికి నిదర్శనమని చెప్పారు. ‘నడ్డా వస్తాడో.. బీజేపీ రాష్ట్ర నాయకులు వస్తారో.. రండి.. సిద్దిపేటకు వస్తే 50 గ్రామాల్లోని పంట పొలాల్లో, కాలువల్లో గల గల పారుతున్న గోదావరి జలాలు చూపిస్తా.. నేనే కాదు మా రైతులు కూడా చూపిస్తారు..’ అని హరీశ్రావు పేర్కొన్నారు.
రావడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంటు సాక్షిగా ప్రకటిస్తే.. అవినీతి జరిగిందంటూ నడ్డా విమర్శించడం విడ్డూరమని అన్నారు. పార్లమెంట్లో ఒకమాట.. పాలమూరులో ఒక మాట.. మంత్రిది ఒక మాట.. అధ్యక్షుడిది ఒకమాటలా బీజేపీ వ్యవహారం ఉన్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో 600 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, బీజేపీ రాష్ర్టాల్లో అరవై అయినా అమలుచేస్తున్నారా? అని నిలదీశారు. తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్రం సాయం చేయకపోవగా, రాష్ర్టానికి రావాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిదేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఒక్క రూపాయైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
గ్యాస్ ధరలు పెంచి రాష్ట్రంపై దుష్ప్రచారమా?
బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత గ్యాస్ ధర రూ.400 నుంచి రూ.1,050కి పెరిగిందని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. గ్యాస్పై ఏడేండ్లలో రూ.650 పెంచి, రాష్ట్రం అధిక పన్నులు వేస్తున్నదంటూ వాట్సాప్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యాస్ ధరలు పెంచడమే కాకుండా సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచి, సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ విధానాలను టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ తిప్పికొట్టి ప్రజలకు నిజాలను తెలియజేయాలని సూచించారు.