హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఈ నెల మూడో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధమవుతున్నది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 65.54 లక్షల ఎకరాల్లో వరి సాగైన నేపథ్యంలో సుమారు 1.30-1.40 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో 30-40 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు, ఇతర రాష్ర్టాల వ్యాపారులు కొనుగోలు చేస్తారని అంచనా.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కోటి టన్నులకు పైగా ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. దీంతో ఈ సీజన్లో 1.10 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం అత్యధికంగా గత వానకాలం (2021-22)లో 70.22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడువేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేరకు టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు, వడ్లు తూర్పార పట్టే మిషన్లను సమకూర్చేందుకు చర్యలు తీసుకొంటున్నారు. దాదాపు 20 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని భావిస్తున్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించనున్న ఉన్నతస్థాయి సమీక్షలో ధాన్యం కొనుగోళ్లపై విధి విధానాలు ఖరారు చేయనున్నారు.