కందుకూరు/బడంగ్పేట, మే 8: ఈ ప్రాంత ఆడబిడ్డనైన తన పట్ల సీఎం రేవంత్రెడ్డి ఇష్టానుసారంగా అభ్యంతరకరంగా మాట్లాడుతూ చులకన చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మెయిన్రోడ్డుతోపాటు మహేశ్వరం మండల కేంద్రంలో రోడ్షో నిర్వహించారు.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్తో కలిసి ఎన్నికల సభల్లో ఆమె మాట్లాడారు. తాను రాత్రి బీజేపీకి, ఉదయం బీఆర్ఎస్కు ప్రచారం చేస్తున్నట్టు సీఎం ఆరోపిస్తున్నారని, బీజేపీకి ప్రచారం చేయాల్సిన గతి తనకు పట్టలేదని తెలిపారు. ముందు గత ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలని రేవంత్రెడ్డిని ఆమె డిమాండ్ చేశారు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కందుకూరుకు మంజూరైన మెడికల్ కశాశాలను సీఎం రేవంత్రెడ్డి రద్దు చేసి కొండంగల్కు తీసుకెళ్లి ఈ ప్రాంతానికి మోసం చేశారని విమర్శించారు. మెట్రో, ఫార్మాసిటీలను సీఎం ఎందుకు రద్దు చేశారని ఆమె ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి చేవెళ్లకు చేసింది గుండు సున్నా అని ధ్వజమెత్తారు. బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా సభల్లో ఎస్సీ కమిషన్ మాజీ మెంబరు నర్సింహ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మార్కెట్ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజునాయక్, చంద్రయ్య, అనుమగల్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.