ఇంఫాల్ : కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో మణిపూర్లోని ఏడు జిల్లాల పరిధిలో ప్రభుత్వం 24 గంటల కర్ఫ్యూ విధించింది. శనివారం నుంచి 17వ తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఇఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, చురాచంద్పూర్, ఉఖ్రుల్ జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవలకు అనుమతి కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఇంఫాల్ విమానాశ్రయం సైతం తెరిచే ఉండనుంది. మార్కెట్ల వద్ద కదలికలు పరిమితం చేయాలని జిల్లా మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. శుక్రవారం మణిపూర్లో 600 కరోనా కేసులు రికార్డయ్యాయి. మణిపూర్లో ఇప్పటి వరకు 34,333 కొవిడ్ కేసులు రికార్డవగా.. 30,378 మంది కోలుకున్నారు. మరో 3,506 యాక్టివ్ కేసులున్నాయని, ఇప్పటి వరకు వైరస్ బారినపడి 449 మంది మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం ఏప్రిల్ 29న గ్రేటర్ ఇంఫాల్ ప్రాంతాన్ని కంటైనేషన్ జోన్గా ప్రకటించింది. ఇందులో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది.