గద్వాల, అక్టోబర్ 11 : ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేయడంతో అక్రమ మద్యం తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఒక్కోసారి ఎక్సైజ్ అధికారుల కల్లు గప్పి సరిహద్దులు దాటి మద్యం రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నా అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు.
తెలంగాణ రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉండడం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మద్యం పాలసీ విధానాల్లో తేడా ఉండడంతో కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొచ్చి దళారులు మన ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్ణాటక మద్యం ఎక్కువగా మన రాష్ట్రంతోపాటు ఆంధ్రాకు వాహనాల్లో తరలించడంతోపాటు కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో విక్రయిస్తున్నారు.
కర్ణాటకలో దొరికే లిక్కర్ తక్కువ ధరలో ఉండడంతో వ్యాపారులు అక్కడి నుంచి మద్యం తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఏపీలో మన బ్రాండ్స్ దొరకకపోవడంతో అక్కడి వారు కర్ణాటక, తెలంగాణ నుంచి మద్యం వారి ప్రాంతాలకు తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఇటీవల కాలంలో కేటీదొడ్డి మండలం పాతపాలెం, అయిజ మండలం ఉత్తనూర్ స్టేజీ వద్ద ఇన్నోవా కారులో గుట్కాల సంచుల మధ్యలో కర్ణాటర మద్యం తరలిస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు.
తనిఖీలో భారీగా పట్టుబడుతున్న మద్యం..
ఎక్సైజ్ అధికారులు జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తుండడంతో కర్ణాటక నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే అక్రమ మద్యం పట్టుబడుతుంది. నిత్యం ఏదో ఒకచోట మద్యం పట్టుబడుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 10కేసులు నమోదు కాగా 78మందిని బైండోవర్ చేశారు. 2,928 లీటర్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. 24 వాహనాలను సీజ్ చేశారు. జిల్లాలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వారిపై 105 కేసులు నమోదు చేయగా 128మందిని బైండోవర్ చేశారు. 575లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని ఐదు వాహనాలను సీజ్ చేశారు.
గత నెల కర్ణాటక సరిహద్దులోని నందిన్నే చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటక నుంచి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న 110 ఓసీ విస్కీ పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే నెలలో పాతపాలెంలో కారులో ఇతర ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న కారును తనిఖీ చేయగా భారీ మొత్తంలో చీప్ లిక్కర్ లభ్యమైనది.
ఈ నెల 4న అయిజలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో డోన్ మండలం వెంకటాపురానికి చెందిన వ్యక్తి రాయచూర్లో మద్యం తీసుకొని వస్తుండగా 30కాటన్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 5వ తేదీన ఉత్తనూర్ స్టేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం పాలకొలనుకు చెందిన వారు ఇన్నోవా వాహనంలో 28గుట్కా సంచులతోపాటు 48 కర్ణాటక మద్యం ప్యాకెట్లు తీసుకొస్తుండగా అధికారులు పట్టుకొని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తుండడంతో అక్రమ మద్యానికి కొంతమేర అడ్డుకట్ట పడినట్లయింది.
మద్యం తరలిస్తే చర్యలు..
కర్ణాటక నుంచి తెలంగాణ, ఆంధ్రపదేశ్కు మద్యం తరలించే వారిపై చర్యలు తీసుకుంటున్నాం. అక్రమ మద్యాన్ని అరికట్టడానికి నిత్యం రాత్రివేళల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 10కేసులు నమోదు చేసి 128మందిని బైండోవర్ చేశాం. కర్ణాటక మద్యం ఇక్కడ విక్రయించినా, అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అక్రమంగా మద్యం తరలించే వారి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలి.
– గోపాల్, ఎక్సైజ్ సీఐ, గద్వాల