Lok Sabha Elections | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఐదు రిజర్వ్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నెలకొన్నది. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ లేని ప్రత్యేక వాతావరణం ఈసారి నెలకొన్నది. వీటిలో ఆదిలాబాద్, మహబూబూబాద్ ఎస్టీ నియోజకవర్గాలు. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒకే ఫార్ములాను అనుకరించడం ఆసక్తికరంగా మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్లో ఆదివాసీ, ఆదివాసీయేతరుల మధ్య దూరాన్ని పెంచి వారిని శతృవర్గంగా మార్చిందనే విమర్శలను బీజేపీ మూటగట్టుకున్నది. ఆదిలాబాద్లో రాజుకున్న అగ్గి రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ, ఆదివాసీయేతర గిరిజనుల మధ్య సఖ్యతను ప్రశ్నార్థకం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈసారి ఆదిలాబాద్ టికెట్ను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గోండు తెగకు కేటాయించాయి. మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని లంబాడీ/బంజారా తెగకు కేటాయించాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో తమకు సరైన ప్రాధాన్యం కల్పించలేదని కోయ గిరిజన తెగ అలకబూనింది. దీంతో ఆ వర్గం ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీపై మాదిగ సామాజికవర్గం ఆగ్రహంగా ఉన్నది. రాష్ట్రంలోని మూడు రిజర్వ్ నియోజకవర్గాల్లో కనీసం ఏ ఒక్కచోట కూడా తమకు అవకాశం ఇవ్వకుండా, మాల సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇచ్చిందని మాదిగ సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీపై భగ్గుమంటున్నది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ సహా అన్ని మాదిగ సామాజిక సంస్థలు, సంఘాలు కాంగ్రెస్పై విమర్శలు సంధిస్తున్నాయి. మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నర్సింహులు లాంటి నేతలు కాంగ్రెస్పై ప్రత్యేకించి సీఎం రేవంత్రెడ్డిపై ఒంటికాలిపై లేస్తున్నారు. రాష్ట్రంలోని మాదిగ సామాజికవర్గ జనాభాకు అనుగుణంగా టికెట్ల కేటాయించలేదని, కనీసం ఒక్క స్థానంలోనైనా పోటీచేయడానికి మాదిగలకు అర్హత లేదా? అని ఆ వర్గం ప్రశ్నిస్తున్నది. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అసలు మాదిగే కాదని, మాదిగ ఉపకులమని ఒకవర్గం, అసలు ఆమె ఎస్సీయేకాదని మరోవర్గం విమర్శలు గుప్పిస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది.
వరంగల్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీచేస్తున్న ముగ్గురు అభ్యర్థులు కూడా గతంలో బీఆర్ఎస్కు చెందినవారేకావడం గమనార్హం. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్ తెలంగాణ ఉద్యమం ఆవిర్భావం నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన కార్యకర్త. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య రాజకీయ జీవితాన్ని బీఆర్ఎస్ నుంచే ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ పూర్వాశ్రమంలో ఒకసారి పీఆర్పీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్లో చేరిన తరువాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పోటీచేస్తున్న ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్ నీడలో ఎదిగినవారే. మొత్తంగా ఐదు రిజర్వ్ స్థానాల్లో మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్న 15 మందిలో 10 మంది బీఆర్ఎస్కు చెందినవారే కావడం మరో విశేషం.
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో భద్రాచలం, పినపాక, ఇల్లందు, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నర్సంపేట మినహా మిగిలిన ఆరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలే. వీటిలో మహబూబాబాద్, డోర్నకల్ స్థానాల్లో లంబాడా/బంజారా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పినపాక (పాయం వెంకటేశ్వర్లు), ఇల్లందు (కోరం కనకయ్య), భద్రాచలం (తెల్లం వెంకట్రావ్), ములుగు (మంత్రి సీతక్క)తోపాటు నర్సంపేట నియోజకవర్గాల్లో తమ సామాజికవర్గ జనాభా ఎక్కువ అని, పార్లమెంట్ స్థానం తమకే కేటాయించాలని కాంగ్రెస్పై ఒత్తిడి తెచ్చినప్పటికీ, తమను ఆ పార్టీ విస్మరించిందని కోయ గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికకు ముందు తప్పకుండా ‘ఈసారి మనకే అవకాశం వస్తుంది’ అని మంత్రి సీతక్క తమ వర్గీయులతో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రభుత్వంలో సీతక్క ప్రభావాన్ని తగ్గించేందుకే కోయలకు టికెట్ కేటాయించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం కలిగిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.