Government Hospitals | పోచమ్మమైదాన్, మే 4: ఓ పక్క భరించలేని ఎండ వేడిమి.. మరోపక్క వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఏసీలు పనిచేయక.. పీడియాట్రిక్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్న శిశువులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎంజీంలోని పీడియాట్రిక్ యూని ట్ ఐసీయూ/హెచ్డీయూ వార్డుల్లో నెలలు నిండని పసికందులకు చికిత్స అందిస్తారు. వీరి కోసం రెండు వార్డుల్లో ఎనిమిది ఏసీలు అమర్చినప్పటికీ అవి పనిచేయడం లేదు. ఫ్యాన్ల నుంచి వచ్చే వేడిగాలి, ఉక్కపోత భరించలేక శిశువులు తల్లిడిల్లిపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎంతో దూరం నుంచి చిన్నారులను దవాఖానకు తీసుకొస్తే.. ఇక్కడ సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు.
ఎంజీఎం ఆవరణతోపాటు పలు వార్డులో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. మార్చురీలోని ఏసీలు రెండు నెలలకు పైగా పనిచేయక మృతదేహాలు కంపుకొడుతున్నాయి. దీంతో మృతదేహాలకు పోస్టుమార్టం చేయడానికి వైద్యులు జంకుతున్నారు. ఇక్కడి సిబ్బంది సైతం అల్లాడిపోతున్నారు. శవాల నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నామని చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖాన రెండో అంతస్తులో ఉన్న పల్మనాలజీ విభాగంలోని శుక్రవారం ఏసీలు పనిచేయ లేదు. ఉన్నతాధికారులు వాటికి మరమ్మతులు చేయించడం విస్మరించారు. మరో వైపు ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో రోగులు ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారు. చేసేదిలేక కొందరు రోగులు ఇంటి నుంచి కూలర్లను తెచ్చుకొని ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయినా.. దవాఖాన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రోగులు, బంధువులు విమర్శలు గుప్పిస్తున్నారు.