పోలీసుల అదుపులో నిందితులు
కుత్బుల్లాపూర్, జూన్13 : ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి ఇంట్లో ఉన్న సొమ్ముతో ఉడాయించిన నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం…తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని పండ్లపాక గ్రామానికి చెందిన యాసలపు రాజీవ్(37), హేమలత(33) దంపతులు కుత్బుల్లాపూర్లోని శ్రీక్రిష్ణానగర్లో అద్దెకు ఉంటున్నారు.అప్పులు తీర్చేందుకు రాజీవ్ నేరాల బాట పట్టాడు. వీరి ఇంటి పక్కనే ఉంటున్న తలారి సుజాత(73) ఒంటరిగా నివసిస్తున్నది.
వృద్ధురాలి కొడుకు, కూతురు విదేశాల్లో ఉండగా మరో కూతురు కొంపల్లిలో ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని దంపతులిద్దరూ వృద్ధురాలి వద్ద నమ్మకం ఏర్పరుచుకున్నారు. అప్పులు అధికం కావడంతో వృద్ధురాలి బంగారం, డబ్బును కాజేయాలని పథకం పన్నారు. మే24న వృద్ధురాలిని కత్తితో హతమార్చి, ఇంటికి తాళం వేసి డబ్బు, నగలును దొచుకెళ్లారు. మూడు రోజులుగా ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చి కొంపల్లిలో ఉన్న కూతురు ఇంటికి వచ్చింది. లోపల దుర్వాసన రావడంతో తలుపులు పగులగొట్టి వెళ్లి చూడగా తల్లి శవమై కనిపించింది. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ చేపట్టి, నిందితులు రాజీవ్, హేమలతను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకున్నారు. వారి నుంచి రెండు జతల బంగారు చెవిపోగులు, రూ.వెయ్యితో స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సీఐ రమేశ్, ఎస్ఐలు భానుప్రసాద్, మల్లేశం ఉన్నారు.