Lok Sabha Elections | సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల పర్వంలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. గురువారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ల సెట్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. చివరి రోజు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
చివరి రోజు గురువారం హైదరాబాద్ స్థానానికి 25 మంది, సికింద్రాబాద్ స్థానానికి 23 మంది, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 15 మంది, మల్కాజిగిరి స్థానానికి 61 మంది, చేవెళ్ల స్థానానికి 30 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణకు 29వ తేదీ చివరి గడువు కాగా, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్నది. మొత్తంగా నామినేషన్ల దాఖలు ముగియడంతో పోల్పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. అగ్ర ప్రచారంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటేలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.