Anasuya | నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల హిందూ ధర్మం, మతపరమైన నినాదాల దుర్వినియోగానికి సంబంధించి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్రోల్ చేయగా.. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ వివాదం నేపథ్యంలో అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించి, అసలు సందర్భాన్ని తొలగించి ప్రచారం చేస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ మతాన్ని లేదా వర్గాన్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
తాను సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించే హిందువునని అనసూయ స్పష్టం చేశారు. తన విశ్వాసాలు, ధర్మం, విలువల పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. నిజం వైపు నిలబడటం, తప్పును ప్రశ్నించడం, ఇతరులను గౌరవించడం వంటి విషయాలను తన ధర్మం నుంచే నేర్చుకున్నానని పేర్కొన్నారు.అలాగే తాను హనుమంతుడి భక్తురాలినని, హనుమంతుడి ధైర్యం తనకు స్ఫూర్తినిస్తుందని చెప్పుకొచ్చారు. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అదే తనకు బలాన్ని ఇస్తుందని తెలిపారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేయడం, వ్యక్తిగతంగా దాడులకు దిగడం, బెదిరింపులకు పాల్పడే కొంతమంది వ్యక్తులను ఉద్దేశించే తాను మాట్లాడానని అనసూయ వివరణ ఇచ్చారు.
అది ఏదైనా మతం లేదా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్య కాదని స్పష్టం చేశారు. అయితే తన మాటల నుంచి కొన్ని భాగాలను మాత్రమే తీసుకుని, వాటిని వేరే అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు, సగం సమాచారంతో కూడిన కథనాలను చూసి తనపై అభిప్రాయానికి రావద్దని అనసూయ నెటిజన్లను కోరారు. పూర్తి సందర్భాన్ని తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. తన మాటలను వక్రీకరించి సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం సరికాదని ఆమె అన్నారు. తాను మతం ఆధారంగా ఎవరినీ తప్పుబట్టడం లేదని, వేధింపులు, వ్యక్తిగత దాడులను మాత్రమే ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు.
తాను హిందువునని చెప్పుకోవడంలో ఎలాంటి సంకోచం లేదని అనసూయ పేర్కొన్నారు. తన సనాతన ధర్మంపై తనకు గర్వం ఉందని తెలిపారు. అదే సమయంలో ఎవరు ఏ మతానికి చెందిన వారైనా వేధింపులు, అగౌరవం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.తన వివరణాత్మక పోస్ట్ను ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ అంటూ ముగించారు. దీంతో అనసూయ చేసిన ఈ తాజా పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమెపై వస్తున్న విమర్శలకు ఈ వివరణతో ఫుల్స్టాప్ పడుతుందా? లేక ఈ వివాదం మరింత కొనసాగుతుందా అనేది చూడాలి.