Tirumala : పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో కీలక నిందితుడిని హైదారాబాద్కు చెందిన ఈడీ అరెస్టు చేసింది. కైలాష్ చంద్ మంగళ అనే నిందితుడిని మనీలాండరింగ్ యాక్ట్, 2002 కింద సెక్షన్ 19 ప్రకారం శుక్రవారం ఈడీ అరెస్టు చేసింది. కైలాష్ చంద్ను ఈడీ అధికారులు ఏపీ, విశాఖలోని స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
తిరుపతి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు విచారణ జరుపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా చేసే అంశంలో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి వంటి ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. నెయ్యిలో కల్తీ జరిగింది అనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. 2019-2024 వరకు టీటీడీకి రూ.230 కోట్ల విలువైన నెయ్యి సరఫరా జరిగింది. ఇందులో రూ.96 కోట్ల విలువైన నెయ్యి సరఫరాలో అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి.
అది కూడా కైలాష్ చంద్ మంగళ ఆధ్వర్యంలోనే జరిగిందని ఈడీ అంచనా వేస్తోంది. సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ అయిన కైలాష్ చంద్.. ఈ కంపెనీ నుంచే నెయ్యి సరఫరా చేశాడు. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. ఈ కేసులో తప్పుడు రికార్డుల్ని కూడా కైలాష్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఈడీ ఇంతకుముందు విపిన్ జైన్ అనే నిందితుడిని కూడా అరెస్టు చేసింది. అతడు భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్గా ఉన్నాడు.