GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : పిల్లల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంపులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గ్రేటర్వ్యాప్తంగా వివిధ క్రీడా మైదానాల్లో మే 31 వరకు జరిగే ఈ శిబిరాల్లో 44 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని గ్రౌండ్, చందానగర్లోని పీజేఆర్ మైదానంలో సమ్మర్ కోచింగ్ కార్యక్రమానికి కమిషనర్ రోనాల్డ్ రాస్ హాజరై మాట్లాడారు.
పిల్లలకు చదువుతో పాటు క్రీడలు అవసరమని, వారు నచ్చిన క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. 6 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల బాల బాలికల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు మే 31 వరకు ఈ వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్, క్రీడాకారిణి నైనా జైస్వాల్, స్పోర్ట్ విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.