హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తెలంగాణవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు అమలులోకి వచ్చింది. బుధవారం నుంచి 10 రోజులపాటు అమల్లో ఉండనుంది. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు (నాలుగు గంటలు) కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. నాలుగు గంటలే సడలింపు ఇవ్వడంతో మార్కెట్లు రద్దీగా కనిపించగా.. నిత్యవసర దుకాణాలు జనంతో కిటకిలాడాయి. ఉదయం వేళలో సొంత ఊరి బాట పట్టిన వారితో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా కనిపించగా.. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టాండ్ల వద్ద ప్రయాణికుల సంఖ్య తగ్గింది. లాక్డౌన్ సమయం దగ్గర పడటంతో ఇళ్లకు చేరుకునేందుకు పలువురు ఉరుకులు పరుగులు తీశారు.
ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్లోని అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వస్త్ర, వాణిజ్య, దుకాణ సముదాయాలను వ్యాపారులు మూసివేశారు. లాక్డౌన్ ప్రారంభం కావడంతో సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అత్యవసర సేవలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వెనక్కి పంపుతున్నారు.