షాద్నగర్టౌన్, ఏప్రిల్ 25: మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం షాద్నగర్ ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా మలేరియా ఆఫీసర్ రాకేశ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దోమల ద్వారానే మలేరియా, డెంగీ, మెదడు వాపు, బోదవ్యాధి, చికెన్గున్యా వంటి వ్యాధులు వస్తాయన్నారు. ముఖ్యంగా దోమల ద్వారా విష జ్వరాలు వస్తున్నాయన్నారు. నివాసాలతో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలతో సోకే వ్యాధులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. దోమలతో సోకే వ్యాధులు, దోమల నియంత్రణకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, షాద్నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, జిల్లా మలేరియా కార్యాలయ సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
వికారాబాద్ : మలేరియాను అరికట్టాల్సిన బాధ్యత మనపై ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పాల్వన్కుమార్ అన్నారు. గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్కుమార్ కార్యాలయంలో మలేరియా అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియాను నిర్మూలించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెరుగడం, గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం వలన మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. మలేరియా వ్యాధిని వ్యాపింపజేసే దోమల పెరుగుదలను అరికట్టడానికి నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. ఈ ర్యాలీలో కార్యాలయ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాలొన్నారు.