సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తాగునీటి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని ఎండీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జలమండలి ఓ అండ్ ఎం అధికారులతో ఎంసీసీ (మెట్రో కస్టమర్ కేర్) ఫిర్యాదులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు సొంతంగా ప్రణాళికలు వేసుకొని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరా, కలుషిత నీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మరోవైపు రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లో కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఎస్టీపీ పనుల పురోగతిపై ఎండీ సమీక్షించారు. ఎస్టీపీల పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. అంతర్గత రోడ్లు, లైటింగ్, గార్డెనింగ్, వాల్ పెయింటింగ్ తదితర పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. నిర్మాణ దశలో ఉన్న ఎస్టీపీల్లో కార్మికుల సంఖ్యను పెంచి పనులను పూర్తి చేసి ట్రయల్ రన్కు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు శ్రీధర్ బాబు, అజ్మీరా కృష్ణ, స్వామి పాల్గొన్నారు.