సిటీ బ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): పేదల సొంతింట కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం పూర్తయిన 60 శాతం ఇండ్లను నిజమైన అర్హులకు పంపిణీ చేశారు. వారంతా ఇప్పుడు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సొంతింట్లో సంతోషంగా జీవిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అనర్హులకు, స్థానికేతరులకు, ఎమ్మెల్యేల అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెడుతున్నారు.
దీంతో నిజమైన అర్హుల సొంతింటి కల.. కలగానే మిగిలిపోతున్నది. మహానగరానికి నలుమూలల్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్దిరోజులుగా పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగానే నగరంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టులో ఉన్న వారికే ఇండ్లను కేటాయిస్తున్నారు. కనీసం వాళ్లిచ్చిన లిస్టులో ఎవరున్నారు? నిజమైన అర్హులకు లబ్ధి చేకూరుతున్నదా? అని చూడకుండానే పట్టాలు పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. పేదోళ్లకు ఇండ్లు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించేందుకు స్థలం ఇచ్చినవారిని కూడా కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తూ ఇతరులకు కట్టబెడుతున్నది.
మంగళ్హట్ పరిధిలోని ధూల్పేటలో గుడుంబా తయారీని అరికట్టేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. గుడుంబా తయారీని పూర్తిగా నిర్మూలించి.. తయారీదారులు, కూలీలకు పునరావాసం కింద డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఈక్రమంలో మంగళ్హట్లోని శివలాల్నగర్లో మూడు బ్లాకుల్లో 145 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణం దాదాపు పూర్తయ్యేలోపు ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 145 ఇండ్లలో వందకు పైగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్, స్థానిక కాంగ్రెస్ నేతల అనుచరులకు కట్టబెట్టిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
ఏండ్ల తరబడిగా అద్దె ఇంట్లో ఉంటున్న తమను ఆదుకునేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఇండ్లను నిర్మిస్తే ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికేతరులకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఇండ్లు కట్టిన ప్రాంతానికి రాకుండా మరోచోట పట్టాలు పంపిణీ చేశారని మండిపడుతున్నారు. శివలాల్నగర్కు వచ్చి పంపిణీ చేస్తే అసలైన అర్హులు అభ్యంతరం వ్యక్తం చేస్తారని.. వేరేచోట తమను నచ్చినవారికి ఇండ్ల పట్టాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించేందుకు స్థలం ఇచ్చినవారిని కూడా పక్కన పెట్టి అనర్హులకు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించేందుకు 200 గజాల ఇంటి స్థలాన్ని తీసుకున్నారు. నాకు ఇల్లు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు పంపిణీ చేసినవారి జాబితాలో నాపేరు లేదు. సొంత స్థలాన్ని కోల్పోయి అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడి ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచరులకు, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. నిజమైన అర్హత ఉన్న నాకు మాత్రం ఇల్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే నాకు ఇల్లు వచ్చేది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ప్రభుత్వం స్పందించి నాకు ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నా.
– రాణి బాయి, శివలాల్నగర్
గుడుంబా తయారీని ఆపేస్తే డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తే.. పూర్తిగా ఆపేశాం. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ మాకోసం డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించారు. కానీ ఇప్పటి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మాత్రం మమ్మల్ని పక్కన పెట్టి అనర్హులకు, వాళ్ల అనుచరులు, కార్యకర్తలకు ఇండ్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గుడుంబా కేసులో నా కుమారుణ్ని అరెస్ట్ చేసి లాకప్ డెత్కు పాల్పడ్డారు. అప్పటి మంత్రి ముఖేష్గౌడ్ మమ్మల్ని ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు రానీయకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నది. దయచేసి మాకు ఇల్లు మంజారు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్, మంత్రి పొన్నం ప్రభాకర్ను వేడుకుంటున్నాం.
– విజయ లక్ష్మి, శివలాల్నగర్
గతంలో గుడుంబా తయారు చేసి బతికేవాళ్లం. కేసీఆర్ ప్రభుత్వం అది ఆపేస్తే ఇల్లు ఇస్తామన్నరు. ఇచ్చిన మాట ప్రకారం మాకోసం ఇండ్లు కట్టించారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఇవ్వకుండా ఎవరికో ఇస్తున్నారు. నా భర్త చనిపోయాడు. కొడుకు ఫర్నీచర్ దుకాణంలలో కూలీగా పనిచేస్తున్నాడు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. మాకు డబుల్ బెడ్రూం కాకున్నా ఒక్క గది అయినా ఇవ్వాలని ప్రభుత్వాన్ని, మా ఎమ్మెల్యేను వేడుకుంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఉంటే గుడుంబా నిర్వాసితులందరికీ ఇండ్లు వచ్చేవి. ఎక్కడో ఉండేవాళ్లకు ఇక్కడ ఇండ్లు ఇస్తున్నారు. మాలాంటి వాళ్లకు అన్యాయం చేస్తున్నారు.
-చందుబాయి, శివలాల్నగర్