కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడుత పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగనున్నది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికే ఏడు విడుతల్లో 259 నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ పూర్తయింది. మిగతా 35 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 283 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 84 లక్షల మందికిపైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మల్దా జిల్లాలోని ఆరు, ముర్షిదాబాద్లో 11, కోల్కతా నార్త్లో ఏడు, బిర్భూమ్ పరిధిలో 11 నియోజకవర్గాల పరిధిలోని 11,860 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటింగ్ జరుగనుంది.
గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. 35 నియోజకవర్గాల పరిధిలో 641 కంపెనీలను మోహరిస్తుండగా.. కేవలం బిర్భుమ్ జిల్లాలోనే 224 కంపెనీల బలగాలను భద్రత కోసం నియమించింది. చివరి విడుతలో అధికార టీఎంసీ, బీఎస్పీ, బీజేపీలు 11 మంది అభ్యర్థులను బరిలో నిలుపగా.. సీపీఎం నాలుగు, కాంగ్రెస్ మూడు, ఏఐఎఫ్బీ రెండు, ఆర్ఎస్పీ ఒక స్థానాల్లో పోటీ చేస్తోంది. కేంద్రంగా కోల్కతా నార్త్లోని బెలెఘటా, శ్యాంపూకూర్, జోర్సాంకో, మణిక్తాలా, కాశీపూర్ – బెల్గాచియా నియోజకవర్గాలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర నెలకొంది. శ్యామ్పుకూర్ స్థానంలో మంత్రి శశిపంజా, బీజేపీకి చెందిన సందీపన్ బిస్వాస్, ఏఐఎఫ్బీకి చెందిన జిబన్ ప్రకాశ్ సాహా బరిలో ఉన్నారు.
బెలెఘాటాలో బీజేపీ నుంచి కాశీనాథ్ బిస్వాస్, సీపీఎం నుంచి రాజిబ్ బిస్వాస్, టీఎంసీ పరేష్ పాల్ పోటీ చేస్తున్నారు. జోరాస్కోలో టీఎంసీ నుంచి వివేక్ గుప్తా, కాంగ్రెస్ అజ్మల్ఖాన్, బీజేపీ నుంచి మీనాదేవి పురోహిత్ పోటీ చేస్తున్నారు. కాశీపూర్ – బెల్గాచియాలో బీజేపీ సిబాజీ సిన్హా రాయ్, సీపీఎం ప్రతిప్దాస్ గుప్తా, టీఎంసీ అతిన్ ఘోష్ను బరిలోకి దింపింది. బోల్పూర్ స్థానంలో మంత్రి చంద్రనాథ్ సిన్హాపై బీజేపీ అనిర్బన్ గంగూలీని బరిలోకి దింపగా.. నానూర్, మురారీ, లాబ్పూర్లలో సైతం పోటాపోటీ ఉంది. పాలక టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీతో పాటు మాల్దా జిల్లాలో సంయుక్తా మోర్చా (కాంగ్రెస్-సీఎంపీఎం-ఐఎస్ఎఫ్ కూటమి) అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ముర్షిదాబాద్ జిల్లా పరిధిలోనూ ఇదే తరహా పోటీ ఉంటుందని భావిస్తున్నారు.