సిటీబ్యూరో, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): హైదరాబాద్పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మల్కాజిగిరి పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో సోమవారం ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏదీ గెలిచినా, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ప్రమాదం ఉన్నదన్నారు. జూన్-2తో ఉమ్మడి రాజధాని ఒప్పందం ముగియనుందని, వచ్చే పార్లమెంటరీ ఎన్నికల తర్వాత ఆ పార్టీల అభ్యర్థులు గెలిస్తే హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకునే కుట్రలను జనాలకు తెలియజేయాలన్నా రు. అదే గనుక జరిగితే ఇన్నాళ్లు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధి, స్థానికంగా ఉండే అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి పోతాయన్నారు. వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశంలో రాజ్యాంగమే ఉండదని, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఇక నదుల అనుసంధానం పేరిట తెలంగాణ ప్రయోజనాలకు గం డికొట్టేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని, ఇక్కడి అవసరాలు తీరకుండానే, ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి కాకుండానే గోదావరి జలాలను కావేరి నదిలోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ గెలిచిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లను బీజేపీ మళ్లించేలా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డా రు. అందుకే, బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటల రాజేందర్పై ఓ డమ్మీ క్యాండెట్ను బలవంతంగా నిలబెట్టి ఆమెను బలి పశువు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంట నే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఓసారి గమనించాలన్నారు. కరీంనగర్లో బండి సం జయ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్, బీజేపీ కోట్లాడుకోవడం కాదు, అక్కడక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలి” అనే వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలన్నారు. అదే విధంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా రేవంత్ రెడ్డికి బీజేపీతో ఉన్న అనుబంధాన్ని బట్టబయలు చేశారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం స్వయంగా బీజేపీలో చేరుతారని కుండ బద్ధలు కొట్టిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు.
ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను నిలువరించే కుట్రలను, ఆ రెండు పార్టీల బాగోతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సోషల్ మీడియా వారియర్ కృషి చేయాలన్నారు. ముస్లిం ఓట్లను మళ్లించుకోవడం కోసమే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ గెలిచిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డియే బీజేపీలో చేరుతారంటూ చెబుతున్న మాటలను జనాలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్కు వచ్చిన ఓట్లనే బీజేపీకి మళ్లించే ప్రయత్నం జరుగుతున్నది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోకవర్గాల పరిధిలో గత ఎన్నికల్లో ఇదే జరిగిందన్నారు. బీజేపీ నేతలపై పోటీ చేసిన మధు యాష్కి, పొన్నం ప్రభాకర్ లాంటి బలమైన నేతలు పార్లమెంటరీ ఎన్నికల్లో ఓడిపోతే, ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన విషయం మరిచిపోవద్దన్నారు. కేసీఆర్పై ఆ పార్టీలకు ఉన్న కోపమే… ఆ రెండు పార్టీలు కలిసి పనిచేసేలా చేస్తున్నాయని, ఇలాంటి కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ పదేళ్లు, కేసీఆర్ హయాంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో బీఆర్ఎస్పై జరిగిన దాడితో 1.8 శాతం ఓట్లతో గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయాం. అప్పుడు జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా ప్రతి పోలింగ్ బూత్ వరకు ఓటర్లను తీసుకువచ్చి పార్టీకి ఓట్లు పడేలా సోషల్ మీడియా వారియర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్ గెలుపునకు ఎంతో కీలకమని, అతి స్వల్ప ఓట్లతో అసెంబ్లీలో సీట్లను కోల్పోయిన విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గుర్తు పెట్టుకోవాలన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతాన్ని పెంచేలా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు బీఆర్ఎస్ గెలిచేలా కృషి చేయాలన్నారు. దేశంలోనే ఏ పార్టీకి రానంత గుర్తింపు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు వచ్చిందన్నారు. నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచిందన్నారు. 3 లక్షల 55 వేల ఓట్ల అధిక్యాన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో వచ్చిందని, వచ్చే ఎన్నికల్లోనూ ఇదే తీరుగా భారీ మెజార్టీతో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ల మధ్య ఉన్న చీకటి ఒప్పందం ప్రకారమే మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండెట్ను బరిలో దించిందన్నారు. చేవెళ్ల టికెట్ అడిగిన అభ్యర్థికి బలవంతంగా మల్కాజిగిరి నుంచి పోటీలోకి ఉంచి బలి పశువును చేసేలా ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి మళ్లించాలనే కుట్ర జరుగుతుందనే దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయన్నారు.
తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదని, మెడికల్ కాలేజీలు, ఐటీఐఆర్ ప్రాజె క్టు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదన్నారు. కనీసం పెద్దరికం కోసం చేపట్టిన నారాపల్లి-రామంతాపూర్ స్కైవే పనులు పూర్తి చేయలేకపోయిందన్నారు. ఇక బీజేపీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పలేరు. ఎందుకు మోదీకి ఓటేయాలో కూడా చెప్పలేని పరిస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నార ని మండిపడ్డారు. సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి చెప్పే అబద్ధాలను నమ్మి మోసపోవొద్దన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే యాదాద్రి దివ్య మందిరాన్ని నిర్మించుకున్నామని, శ్రీరాముడు ఆ ఒక్క పార్టీకి చెందిన దేవుడు కాదనీ, భవ్య రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్క హిందువు తోచిన విధంగా సాయం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కానీ శ్రీరాముడు ఆ పార్టీకి మాత్రమే సొంతమైనట్లుగా బీజేపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నదుల అనుసంధానం, రాజ్యాంగం రద్దు, 2026లో లోక్సభ, అసెంబ్లీ సీట్ల డిలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ర్టాలకు పెద్ద ప్రమాదమే పొంచి ఉందన్నారు. 2026లో వచ్చే డిలిమిటేషన్ ద్వారా దక్షిణాది గొంతును నలిపివేసే ప్రమాదం ఉందనీ, బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్లమెంట్ స్థానాలను తగ్గించే అవకాశం కూడా ఉందన్నారు. ఇలాంటి కుట్రలను నిలువరించాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. ఇక కొడంగల్లో ఓడిన రేవంత్ రెడ్డి, ప్రశ్నించే గొంతుక అంటూ మల్కాజిగిరిలో ఎంపీగా గెలిచిన ఆయన, కనీసం పార్లమెంట్లో తెలంగాణ కోసం ప్రశ్నించలేదన్నారు. బీఆర్ఎస్ కండువా కప్పుకున్న రాగిడి లక్ష్మారెడ్డి గెలిస్తేనే కేంద్రంలో జరిగే కుట్రలను తిప్పి కొట్టగలుగుతారని స్పష్టం చేశారు.
మల్కాజిగిరిలో ఎంపీగా గెలిచి, పీసీసీ, అక్కడి నుంచి సీఎం సీటులో కూర్చున్న రేవంత్, ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కనీసం ప్రశ్నించే గొంతుకలా ఉంటానని కేంద్రం నుంచి రూపాయి తీసుకురాలేదన్నారు. అరచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అబద్ధాలను జనాల్లోకి తీసుకుపోవాలన్నారు. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తానని గెలిచిన రేవంత్ రెడ్డి జనవరి నెలలో 46 లక్షల మందికీ పెన్షన్ ఎగగొట్టాడనన్నారు. రేవంత్ చెప్పినట్లుగా రుణమాఫీ కాలేదు, పెన్షన్ పెరగలేదు, ఆడపిల్లలకు స్కూటీ రాలేదనే విషయాలన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు.
తెలంగాణకు మోదీ చేసిందేమిటో, బీజేపికి ఎందుకు ఓటు వేయాలంటే చెప్పలేని స్థాయిలో ఇక్కడి నేతలు ఉన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచింది మోదీ సర్కారేనని, గ్యాస్ నుంచి మొదలుకుంటే ఉప్పు వరకు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, దేశంలో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గవని ఎద్దేవా చేశారు. 2014లో బ్యారెల్ ధర 100 డాలర్లు ఉంటే, 2024లో 84 డాలర్లుగా ఉన్నా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం వందకు తగ్గేది లేదన్నారు.
సోషల్ మీడియాలో ఉన్న వారంతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎండగట్టాలి. 13 ఎంపీ సీట్లను గెలిస్తే ఏడాది కాలంలో రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ శాసిస్తోందన్నారు. గడిచిన 10ఏళ్లలో మోదీ చెప్పినా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి… బీజేపీకి ఓటు వేయమని ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను ఎప్పటికైనా బీఆర్ఎస్ నిలువరిస్తుందన్నారు. గతంలోనూ బీజేపీ తీస్మార్ ఖాన్లను ఓడగొట్టిన బీఆర్ఎస్ ఆ పార్టీలతో ఎందుకు లాలూచీ పడుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనని చేసిన తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కంటోన్మెంట్ను నివేదితను గెలిపించాలి. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి.