హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్.. తెలంగాణ ఇంటి పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ భవన్లో ఆయన గులాబీ జెండాను ఎగరవేశారు. అంతకు ముందు తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకంటూ ఒక గొంతు ఉండటం అవసరమని, తెలంగాణకంటూ ఉన్న ఒక ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని, తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీ రామరక్ష అన్న నాటి జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఏనాడూ విజయాలకు పొంగిపోదని, అపజయాలకు కుంగిపోదని తెలిపారు. 2001లో శూన్యంలాంటి వాతావరణంలో, అనేక ప్రతికూలతలు ఉన్నా చిమ్మ చీకటిలో ఒక చిన్న కాంతిరేఖలాగా జలదృశ్యంలో పార్టీని ప్రారంభించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్దేనని గుర్తించిన ప్రజానీకం 2014లో తమ పార్టీకి అధికారం కట్టబెట్టారని కేటీఆర్ చెప్పారు. తొమ్మిదిన్నరేండ్ల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని తెలిపారు. జాతీయస్థాయిలో మన ఆలోచనా విధానాన్ని తీసుకెళ్లాలని, తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని వివరించారు.
బీఆర్ఎస్ పార్టీకి 24 యేండ్లు నిండుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, గులాబీ సైనికులు, ఆడబిడ్డలు, అఖండమైన ప్రేమను నింపిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాదిమంది తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటామని, కేసీఆర్ చూపిన బాటలో మరోసారి పునరంకితం అవుతామని కేటీఆర్ చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నే గోవర్ధన్రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.