Backward Classes | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బడుగులు పిడికిలెత్తారా? కాంగ్రెస్, బీజేపీలపై బీసీలు తిరుగుబాటు జెండా ఎత్తారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రాంతీయ పార్టీల ద్వారా తమ హక్కులు సాధించుకున్న బీసీలు.. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకే అండగా నిలుస్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయని, తెలంగాణలోనూ ఇదే ధోరణి ఉన్నదని సామాజిక పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాధించుకున్న హక్కులను కాపాడుకోవడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్న భావన బలహీనవర్గాల్లో బలంగా వ్యక్తమవుతున్నదని చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం ఎన్నికల సమయంలోనే బీసీ రిజర్వేషన్లు, కులగణన తదితర అంశాలను తెరమీదికి తెచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయని, ఈ విషయాన్ని గ్రహించిన బీసీలు బీఆర్ఎస్ వైపు సమీకృతులవుతున్నారని వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల కాళ్లు విరగగొడితే, బీజేపీ ఏకంగా తినే చేతులనే తెగనరికిన చందంగా వ్యవహరిస్తున్నదనే ఆవేదన వారిలో వ్యక్తమవుతున్నది.
‘రాజ్యాధికారంలో బీసీ వాటా’ అనే నినాదాన్ని పరిపూర్ణం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని సామాజిక విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా పరిపాలనలో సామాజిక న్యాయాన్ని కేసీఆర్ పాటించినంతగా మరెవ్వరూపాటించలేదన్న భావన బలహీనవర్గాల్లో వ్యక్తమవుతున్నది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ వర్గాలు ఏకోన్ముఖంగా బీఆర్ఎస్కు మద్దతుగా నిలవబోతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో బీసీ వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన సంస్కరణలను గుర్తుచేస్తున్నారు. సకల జనుల సర్వే చేపట్టి దాని ఆధారంగా సమాజంలో అట్టడుగు వర్గాలకు కేసీఆర్ న్యాయం చేశారని వివరిస్తున్నారు. దేశంలో తొలిసారిగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు, మద్యంషాపుల కేటాయింపులో గౌడన్నలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడుతున్నారు. బీసీలకు రాజకీయ, అధికార పదవులు కట్టబెట్టే విషయంలో కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఉదహరిస్తున్నారు.
తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఆర్థిక మంత్రి వంటి కీలకమైన పదవులతోపాటు అనేక పదవులు బీసీలకు ఇచ్చి కేసీఆర్ గౌరవించారని గుర్తుచేస్తున్నారు. బీసీ కులాల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం పెంపొందించే అనేక చర్యలను కేసీఆర్ చేపట్టారని వివరిస్తున్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, గురుకులాలు, గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ, విదేశీ విద్యానిధి, ఆసరా పింఛన్ల పెంపు తదితర చరిత్రాత్మక పథకాల ద్వారా బీసీ కుటుంబాల బలోపేతానికి కేసీఆర్ చేసినంత కృషి ఇంకెవ్వరూ చేయలేదని సామాజిక అధ్యయనవేత్తలు చెప్తున్నారు. సంక్షేమ పథకాల అమలులోనే కాకుండా, బీసీల దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం చిత్తశుద్ధితో కేంద్రాన్ని నిలదీసింది బీఆర్ఎస్ మాత్రమేనన్న కృతజ్ఞతాభావం ఆయా వర్గాల్లో కనిపిస్తున్నది. చట్టసభల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, కులగణన తదితర క్రియాశీల అంశాలపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన రికార్డు ఒక్కటి చాలు తాము ఎల్లకాలం కేసీఆర్కు కృతజ్ఞతగా నిలవడానికి అని బీసీలు సగర్వంగా ప్రకటిస్తున్నారు.
తమకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు జాతీయస్థాయిలో మాట తప్పాయని బీసీలు గుర్రుగా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనే బీజేపీ కొల్లగొట్టిందని బీసీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది సంఖ్యను 41.76 లక్షల నుంచి 34.5 లక్షలకు కుదించడమే కాకుండా, 16 లక్షలకుపైగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కొలువులను భర్తీ చేయకుండా బీసీ రిజర్వేషన్లను ఎత్తగొట్టిందే మోదీ సర్కారు అని బీసీలు మండిపడుతున్నారు. ప్రయివేటీకరణ ముసుగులో మోదీ రిజర్వేషన్లను అదానీకరణ చేస్తున్నారని వెనుకబడిన వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. మరోవైపు, 2021లో బీసీల జనగణన చేపడతామని 2018లో కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో రాజ్నాథ్సింగ్ ఇచ్చిన హామీ ఏమైందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
ప్రధాని మోదీని బీజేపీ ఉద్దేశపూర్వంగా బీసీగా పరిచయం చేసినా ఆయన ఏనాడూ బీసీల మేలు కోసం ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదని, కనీసం బీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలన్న డిమాండ్ను కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయంగా, చారిత్రకంగా తమను అన్ని విధాలుగా అణచివేసిందే కాంగ్రెస్ పార్టీ అని బీసీలు ఉదహరిస్తున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ దాకా కేంద్రంలో పరిపాలన సాగించిన అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు తమను వంచించాయని బీసీలు మండిపడుతున్నారు. ఇప్పుడు రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి కూడా టికెట్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం చేశారని ఉదహరిస్తున్నారు. బీసీ కులగణన చేపడతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడే సీట్లు బీసీలకు కేటాయించిందని, అలాంటి పార్టీని ఎలా నమ్మగలనమని ప్రశ్నిస్తున్నారు.
ఎంపీ టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. బీసీ సామాజికవర్గానికి ఏకంగా ఆరు టికెట్లు కేటాయించి వారి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నది.