హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వివిధ శాఖలకు సంబంధించి 5 వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పోస్టు నుంచి తొలగించాలంటూ హైకోర్టు సీఎస్కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన శాఖల్లో ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయో లెక్క తీయాలని అధికారులను సీఎస్ ఆదేశించినట్టు తెలిసింది. అన్ని శాఖల్లో కలిపి 5 వేలకు పైగానే కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయని తేలినట్టు సమాచారం.
ఇందులో ఒక్క ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిపైనే 2 వేలకు పైగా ధిక్కరణ కేసులు పెడింగ్లో ఉన్నట్టు తెలిసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండటం గమనార్హం. అయితే తాజా తీర్పు, వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులు ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం రేవంత్రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చినా సీఎం రేవంత్రెడ్డి మాత్రం హైడ్రాను సమర్థిస్తూ వస్తున్నారు. హైకోర్టు ఆదేశాలపై ఆర్డర్ పూర్తి కాపీ వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.