రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్నానని చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోదీ పేదల నేల విమానాన్ని సమాధి చేస్తున్నారు. పేదోడి రైలుబండి పెద్దోళ్ల జేబుల్లోకి వెళ్తున్నది. కోట్లాదిమంది సామాన్యుల ప్రయాణ సాధనం.. కొద్దిమంది లాభార్జన వస్తువుగా మారుతున్నది. రైల్వే ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి బతుకుపై చావు దెబ్బ కొడుతున్నది.
Train | హైదరాబాద్, మే 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): భారత జాతి సొత్తుగా ఇప్పటివరకూ చెప్పుకొంటున్న సామాన్యుడి రైలు.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వచ్చే నెల 4న కేరళలో తొలి ప్రైవేటు రైలు కూత పెట్టనున్నది. ఐదేండ్ల కిందట ఐఆర్సీటీసీ తొలిసారిగా ఢిల్లీ-తేజస్ రైలును నడుపగా, ఇప్పుడు ఏకంగా పూర్తి ప్రైవేట్ భాగస్వామ్యంతో రైలు ప్రయాణం సాగనున్నది.
2014లో కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రైల్వేలను ప్రైవేటుపరం చేసే కుట్రలు మొదలయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1924లో మొదలైన రైల్వే బడ్జెట్ ప్రస్థానానికి 2016లో మంగళంపాడిన మోదీ ప్రభుత్వం.. అనంతరం రైల్వేను ప్రైవేటుపరం చేయడానికి వ్యూహాలు రచించింది. దేశంలోని 109 మార్గాల్లో 151 ప్రైవేటు రైళ్లు నడుపడానికి ప్రైవేటు సంస్థలకు 2020 జూలై 1న ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మార్గాలన్నీ లాభాల్లో ఉన్నవే కావడం గమనార్హం.
సాధారణంగా రైళ్లలో ప్రయాణించేది పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులే. వీరిలో చాలామంది తమవెంట తమ సంతానాన్ని, లగేజీలను తీసుకువెళ్తుంటారు. ప్రస్తుతం ఈ లగేజీలకు, చిన్నారులకు టికెట్లు తీసుకోకపోయినా.. ప్రయాణానికి అనుమతి ఉన్నది. అయితే, కేంద్రం ప్రైవేటుకు కట్టబెట్టిన 109 మార్గాల్లో ప్రయాణించే ప్రైవేటు రైళ్లలో వీటిని అనుమతిస్తారా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. పైగా ఈ రైళ్లలో టికెట్ రేట్లు, ఆహారం ఇలా అన్ని రుసుములను ప్రైవేటు వ్యక్తులే నిర్ణయించనున్నారు. దీంతో సామాన్యులకు రానున్న రోజుల్లో రైలు ప్రయాణం ఖరీదుగా మారే ప్రమాదమున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రైళ్లను ప్రైవేటుపరంచేయడమే కాదు రైల్వే ఆస్తులను, ముఖ్యంగా భూములను కూడా 35 ఏండ్లపాటు లీజుకు ఇచ్చి తద్వారా వచ్చిన సొమ్మును ఖజానాలో నింపుకొన్నది బీజేపీ సర్కారు. ఈ మేరకు 2022లో కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. ఇక, వృద్ధులకు రైల్వే టికెట్లపై ఇస్తున్న రాయితీని కరోనా సంక్షోభంలో ఎత్తేసిన ప్రభుత్వం ఇంకా దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. తక్కువ ఛార్జీలున్న ప్యాసింజర్ రైళ్ల స్థానంలో ఎక్స్ప్రెస్ రైళ్లను తీస్సుకొచ్చి పేదోడి జేబుకి చిల్లుపడేలా చేసింది. ఇప్పుడు ఏకంగా రైలును ప్రైవేటుకే అప్పగించింది. దీంతో భవిష్యత్తులో సామాన్యుడికి రైలు ఎక్కడమే గగనమయ్యే దుస్థితిని తీసుకొచ్చింది.