Congress | భోపాల్, మే 9: కాంగ్రెస్ హామీలు శృతి మించుతున్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హస్తం పార్టీ నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నది. ఓట్లు పడితే చాలు.. తర్వాత ఇచ్చేదా, చచ్చేదా అన్నట్టుగా ఉంది ఆ పార్టీ నేతల వ్యవహారం. మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత కాంతిలాల్ భురియా అయితే.. మేము గెలిస్తే ఒక్కో మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు బ్యాంకు ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చాడు.
అంతటితో ఆగకుండా.. ఇద్దరు భార్యలుంటే రెండు లక్షలు వేస్తామని ప్రకటించాడు. ఏది పడితే అది మాట్లాడేందుకు ఆయనేమీ అల్లాటప్పా నేత కూడా కాదు. ఐదుసార్లు ఎంపీగా, ఒకసారి కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు మరోసారి మధ్యప్రదేశ్లోని రత్లం లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు.
గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కో మహిళ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు వేస్తామని మేము మ్యానిఫెస్టోలో పెట్టాం. ప్రతి ఇంట్లో మహిళకు లక్ష రూపాయలు వస్తాయి. ఒకవేళ ఎవరికైనా ఇద్దరు భార్యలు ఉంటే రెండు లక్షలు వస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో ప్రతి మహిళకు రూ.2 వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదేదో బాగుందే అని తెలంగాణలో రూ.2,500 ఇస్తామని చెప్పి గెలిచి 5 నెలలుగా అవుతున్నది. అయినా ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను దేశమంతా ఫాలో అవుతున్నది కాంగ్రెస్.