BAPS Shri Swaminarayan Mandir in Atlanta | అమెరికా అట్లాంటాలోని స్వామి నారాయణ్ మందిరం.. ఎల్లలు దాటిన భారతీయతకు ప్రతీకగా నిలుస్తున్నది. ఆ క్షేత్రంలో అడుగుపెడితే చాలు.. ‘వైకుంఠమే ఇలలో వెలిసిందా?’ అనే భావన కలుగుతుంది. అడుగడుగునా భారతీయ శిల్పకళా సౌందర్యం దర్శనమిస్తుంది.
జార్జియా రాష్ట్రంలోని లిల్బర్న్ పట్టణ శివారులో స్వామి నారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైంది.. స్వామి నారాయణ్ మందిరం. ముప్పై ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయం.. ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాజధాని అట్లాంటాలోని వేలాది హిందువులకు ప్రముఖ దర్శనీయ కేంద్రంగా విరాజిల్లుతున్నది.
ఈ ఆలయ నిర్మాణానికి 2004లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. 2005 సెప్టెంబర్లో నిర్మాణ పనులు మొదలుపెట్టగా, 2007లో తుది దశ పూర్తయింది. 72 అడుగులు ఎత్తుతో, 27 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన స్వామి నారాయణ్ ఆలయం.. నిజంగా ఓ ఇంజినీరింగ్ అద్భుతమే! పాలరాయి, టర్కిష్ సున్నపు రాయి, గులాబీ ఇసుక రాయిని ఉపయోగించి ఆలయాన్ని నిర్మించారు. ఇందుకోసం 35 వేలకు పైగా సుందరాకృతులను భారత్ నుంచి తెప్పించారు. ఆలయంలో అడుగడుగునా దర్శనమిచ్చే ఈ శిల్పాలు.. భారతీయ శిల్పకళా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా 2007 ఆగస్టు 24న ‘విశ్వశాంతి మహాయజ్ఞం’ నిర్వహించారు. ఈ వేడుకకు 10 వేల మందికిపైగా హాజరయ్యారు. 2007 ఆగస్టు 26న, ప్రముఖ్ స్వామి మహారాజ్ చేతులమీదుగా దేవాలయాన్ని ప్రారంభించారు.
ఆలయంలో స్వామి నారాయణ్తోపాటు రాధాకృష్ణులు, సీతారాములు, శివపార్వతులు కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ రోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశ, విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ మందిరంలోకి ప్రవేశించాలంటే.. హిందూ సంప్రదాయాన్ని పాటించాల్సిందే! ఆధునిక వస్త్రధారణతో వచ్చేవారికి నిర్వాహకులు ద్వారం వద్దే దుపట్టాలు అందిస్తారు. సందర్శకుల కోసం ఆలయ కాంప్లెక్స్ లోపల పెద్ద అసెంబ్లీ హాల్, ఫ్యామిలీ యాక్టివిటీ సెంటర్, క్లాస్ రూములను అధునాతన హంగులతో, సకల సౌకర్యాలతో ఏర్పాటుచేశారు. ఇక్కడ వారానికోసారి ప్రత్యేక సభలు నిర్వహిస్తారు. మందిర పరిసరాల్లోని రమణీయ దృశ్య సంపద.. పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఆ ప్రకృతిలో సేదదీరితే కాలం ఘనీభవించడం ఖాయం. మేము అట్లాంటాలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించాం. అలౌకికమైన మానసిక ఉల్లాసానికి లోనయ్యాం. చెప్పలేని ప్రశాంతతను మా హృదయాంతరంగాల్లో నింపుకొన్నాం. ‘జై స్వామి నారాయణ్’ అనుకుంటూ వెనుదిరిగాం.
స్వామి నారాయణ 3 ఏప్రిల్ 1781న ఉత్తర ప్రదేశ్లోని ‘ఛపాయా’ గ్రామంలో జన్మించారు. ఈయనను ‘సహజానంద్ స్వామి’ అని కూడా పిలుస్తారు. ఏడేండ్లకే ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ, మహాభారతాలను ఆపోసన పట్టారు. 11 ఏండ్ల వయసులో దేశాటన చేశారు. రామానంద్ స్వామి దగ్గర శిష్యరికం చేశారు. హిందూ ధర్మం పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో శిష్యులను సంపాదించుకున్నారు. 1830 జూన్ 1న స్వామీజీ పరమపదించారు.
…✍ పంతంగి శ్రీనివాస రావు
మెక్సికోలో ఉన్న ఈ పిరమిడ్లు, దాని చుట్టూ ఉన్న నగరం గురించి ఇవి తెలుసా !!”