కోరుట్ల బల్దియా మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. మొన్న స్వచ్ఛ్ సర్వేక్షణ్-22 అవార్డును దక్కించున్న ఈ మున్సిపాలిటీ, తాజాగా కేంద్రం ప్రకటించిన ‘ఇండియన్ స్వచ్ఛత లీగ్ చాలెంజ్’లో పురస్కారం సాధించింది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇండియన్ స్వచ్ఛత లీగ్ క్యాంపెయిన్లో మన రాష్ట్రంలోని 14 పట్టణాలు పోటీల్లో నిలువగా, మూడింటికి అవార్డులు దక్కాయి. అందులో కోరుట్ల ఒకటి కాగా, పట్టణవాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
కోరుట్ల, సెప్టెంబర్ 27: కోరుట్ల బల్దియా పాలకవర్గం స్వచ్ఛ పోటీల్లో నిలిచి అవార్డు లక్ష్యంగా ప్రత్యేక కృషి చేసింది. పట్టణ ప్రజలు, యువకుల సహకారంతో కోరుట్ల క్లీన్ రైడర్స్ టీమ్ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక డ్రెస్ కలిగిన టీం సభ్యులు, మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సహకారంతో స్వచ్ఛందంగా పబ్లిక్ టాయిలెట్లను శుభ్ర పరచడం, ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, ఇళ్లల్లో ఉన్న పాత బట్టలను సేకరించడం వంటి పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని పురాతన గడి బురుజును ఎంపిక చేసిన బల్దియా అవసరమైన మరమ్మతు పనులు చేయించి, జాతీయత ఉట్టిపడేలా గడి గురుజుకు త్రివర్ణ పతాక రంగులు అద్దించారు. చెత్తా చెదారంతో నిండి కంపు కొడుతున్న పురాతన గడి గురుజు కోనేరును శుభ్రం చేశారు. అందులో ఉన్న చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిదులు చారిత్రక ప్రాంతాల్లో శ్రమదానం చేశారు. వ్యర్థాలు, ప్లాస్టిక్ సంచులు, పిచ్చి మొక్కలు తొలగించి అవార్డు రావడానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రంగులు వేసి, పరిసరాల్లో చెత్త ,చెదారాన్ని తొలగించి పచ్చదనం కోసం పూల మొక్కలు నాటారు.
అందరి సహకారంతోనే..
అందరి సహకారంతోనే ఇండియన్ స్వచ్చత లీగ్ అవార్డు దక్కింది. ప్రజల స హకారంతో వ్యర్థాలు, చెత్త సేకరణ చేపట్టాం. పురాతన, చారిత్రక కట్టడాలను ఎంపిక చేసి పారిశుధ్య పనులు చేపట్టాం. యువత, పారిశుధ్య కార్మికుల సహకారంతో మెరుగైన ఫలితాలు సా ధించాం. అవార్డు రావడానికి సహయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, కౌన్సిలర్లు, కోరుట్ల క్లీన్ రైడర్స్ టీమ్ సభ్యులకు, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు.
– మహ్మద్ ఆయాజ్, మున్సిపల్ కమిషనర్ (కోరుట్ల)