వేములవాడ, మే 6 : “పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొనసాగిన అభివృద్ధి కావాలా..? విధ్వంసం కోరుకునే కాంగ్రెస్ కావాలా? ప్రజలే తేల్చుకోవాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. అభివృద్ధే ఆకాంక్షగా పనిచేస్తున్న బీఆర్ఎస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వేములవాడ పట్టణంలోని పాత ఆంధ్రా బ్యాంక్ ఎదుట సోమవారం జరిగిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. కాశీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోడీ అక్కడి ఆలయాన్ని అభివృద్ధి చేయడాన్ని పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నామని, దక్షిణ కాశీగా ఉన్న వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు బుధవారం వస్తున్న మోడీకి స్వాగతం తెలుపుతున్నామని చెబుతూనే వేములవాడ ఆలయానికి రూ.500 కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
దక్షిణ భారతదేశంలోనే ఇంత పెద్ద గొప్ప ఆలయం మరెకడా లేదని, దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవాలని కోరారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలను ప్రసాద్ సీం కింద పెట్టాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను చంద్రబాబు శిష్యుడు రేవంత్రెడ్డి మరో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు కుట్ర చేస్తున్నారని, దీనిని అడ్డుకోవడం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చాలా అభివృద్ధి చేశామని, రైతులు అవస్థలు పడొద్దని రైతుబంధు పథకానికి రూపకల్పన చేసినట్లు గుర్తు చేశారు. నారు పోసేటప్పుడు ఇవ్వాల్సిన రైతుబంధును కాంగ్రెస్ సర్కారు వరి కోతల సమయంలో ఇస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో ప్రాజెక్టులు, చెరువులు ఎండాయని, సర్కారు అసమర్థతోనే కరువు వచ్చిందన్నారు.
ఎప్పటి నుండో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీకి మనసులో ఉందని, అడ్డగోలుగా ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి తప్పించుకునేందుకు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంత ప్రకటనకు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తాడని ఆరోపించారు. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్రెడ్డి కలిసి మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నారని మండపడ్డారు. నదుల అనుసంధానం పేరుతో కేంద్రం కుట్ర రాజకీయాలు చేస్తున్నా బండి సంజయ్ తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. యువత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రోడ్షోలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఆగ్రోస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కిషన్రావు, ఎన్నికల ఇన్చార్జి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, రాఘవరెడ్డి, మ్యాకల రవి పాల్గొన్నారు.
గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నిధులు తెచ్చానని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెచ్చిన నిధులు ఏడపోయినయ్. వేములవాడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. మధ్య మానేరు, గుడి చెరువును ఎండబెట్టి రైతులు ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హెలీ కాప్టర్లో దిగబోయే స్థలం కోట్లాది రూపాయలు వెచ్చించి సేకరించింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందిన్రు. బీజేపీ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి