కరీంనగర్ కలెక్టరేట్, మే 6 : ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్తోపాటు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్(ఈడీసీ)తో కూడా ఓటేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఉద్యోగ విధులు నిర్వహించే సెగ్మెంట్లోనే ఓటు హక్కు ఉన్న వారికి ఈడీసీ ద్వారా వారు విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలో ఓటేసేలా, ఇతర నియోజకవర్గాల్లో విధులు నిర్వహించే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేసిన యంత్రాంగం, ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
పోలింగ్ విధులు నిర్వహించే వారికి రెండు సార్లు శిక్షణ ఇవ్వగా, మొదటిసారి ప్రతి ఉద్యోగికి ఫామ్ 12, రెండోసారి ఫామ్ 12ఏ అందజేసి వారి వివరాలు సేకరించారు. ఉద్యోగులకు విధులు కేటాయించిన విధంగా ఈడీసీ, పోస్టల్ బ్యాలెట్ అందజేయాలి. అయితే, దరఖాస్తు చేసుకున్న 13,623 మంది సిబ్బందిలో కొంతమందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు అందినట్లు తెలుస్తోంది.
విద్యాశాఖకు సంబంధించిన బోధన, బోధనేతర సిబ్బందికి వేసవి సెలవులు కొనసాగుతుండగా, చాలామంది తమ గ్రామాలకు వెళ్ళారు. ఈ నెల 3 నుంచి పోస్టల్ ఓటింగ్ కొనసాగుతుండగా, ఈ నెల 8తో ముగియనుంది. అయితే, తమకు ఇతర నియోజకవర్గాల్లో పోలింగ్ విధులు కేటాయించడంతో పోస్టల్ బ్యాలెట్ వస్తుందనే ధీమాతో వారంతా దరఖాస్తు చేసుకున్న ఏఆర్వో కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తున్నారు. అటు ఈడీసీ, ఇటు పోస్టల్ బ్యాలెట్ రెండు కూడా కేటాయించకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. శిక్షణ సందర్భంలో రెండు సార్లు ఫామ్లు సేకరించినా, పోస్టల్ బ్యాలెట్, ఈడీసీ రాకపోవడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. పోలింగ్ సామగ్రి తీసుకునే సమయంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అందజేసే అవకాశాలున్నా, అక్కడ కూడా ఈడీసీ పంపిణీ చేయకపోతే, చాలామంది ఎన్నికల సిబ్బంది ఓట్లేయడం హుళక్కేననే చర్చ జిల్లా ఉద్యోగ వర్గాల్లో కొనసాగుతున్నది.