తిరువనంతపురం : కేరళ తొలి రెవెన్యూశాఖ మంత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు కేఆర్ గౌరీ అమ్మ (102) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె దవాఖానలో చేరగా.. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి విషమించి మరణించారు. ఆమె వారం కిందట దవాఖానలో చేరిన సమయంలో జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మూత్ర సంబంధిత వ్యాధులతో తిరువనంతపురంలోని పీఆర్ఎస్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
గౌరీ అమ్మ జూలై 14, 1919న అలప్పుజ జిల్లాలోని చెర్తాలాలో అరుమురి పరంబిల్ పార్వతి అమ్మ, కలతిల్పరంబిల్ రామన్ దంపతులకు జన్మించారు. ఆమె తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేరళలోని ఈజావా వర్గానికి చెందిన మొదటి మహిళా న్యాయ విద్యార్థిని కూడా గౌరీ అమ్మనే. 2019లో ఆమె 100వ పుట్టిన రోజును జరుపుకున్నారు.
కేరళలో 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని మొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో ఆమె రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక నాయకుల్లోనూ ఒకరు. మంత్రిగా భూ సంస్కరణల బిల్లును తీసుకువచ్చారు. అనంతరం ఆమె వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయినప్పుడు ఆమె సీపీఐ(ఎం)లో చేరారు. 1987 ఎన్నికల్లో గెలుపొందినగౌరీ అమ్మకు కేరళకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం రాగా.. రాజకీయాల కారణంగా తప్పుకున్నారు.
1994లో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో జనతిపతియా సంరక్షణ సమితి (జేఎస్ఎస్) పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో గౌరీ అమ్మ యూడీఎఫ్లో విలీనం చేసి.. పార్టీ ప్రభుత్వంలో మరోసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆమె చివరిసారిగా 2011లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.