హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్ష షెడ్యూల్ మారింది. మొదటి సెషన్ జూన్కి, రెండో సెషన్ జూలైకి వాయిదా పడింది. గత షెడ్యూల్ ప్రకారం సెషన్ 1 ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా, దీన్ని జూన్ 20–29వ తేదీ మధ్య.. అదే విధంగా సెషన్ 2 పరీక్షను మే 24–29 మధ్య నిర్వహించాల్సి ఉండగా ఇప్పుడు జూలై 21–30వ తేదీల మధ్య నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో మార్పులు ఎంసెట్ పరీక్షపై ప్రభావాన్ని చూపనున్నాయి.
జేఈఈ మెయిన్ మొదటి సెషన్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసిపోయింది. రెండో విడుతకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో రానుంది. ప్రస్తుతం మొదటి సెషన్ అప్లికేషన్స్కు సంబంధించిన సవరణ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది శుక్రవారం ముగియనుంది.