E-Insurance | ఇక నుంచి ప్రతి ఒక్కరూ తీసుకునే బీమా పాలసీలను డిజిటలైజ్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) నిర్ణయించింది. దీంతో బీమా సంస్థలన్నీ తమ పాలసీదారులకు జారీ చేసే పాలసీలన్నీ ‘ఈ-ఇన్సూరెన్స్’ పద్దతిలోనే పాలసీలు అందించాల్సి ఉంటది. జీవిత బీమా, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ సహా అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలకు ‘ఈ-ఇన్సూరెన్స్’ నిబంధన అమల్లోకి వస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ (ఈఐఏ) అనే ఆన్ లైన్ అకౌంట్లో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తారు. ఈ అకౌంట్ సాయంతో పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్లను ఆన్ లైన్ లోనే యాక్సెస్ చేయొచ్చు. వీటి నిర్వహణ కూడా మరింత సౌకర్యవంతంగా, సౌలభ్యంగా మారుతుంది. ఇన్సూరెన్స్ పాలసీలకు రోజురోజుకు ఆదరణ పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి వినియోగం సులభతరం చేయాలని ఐఆర్డీఏఐ భావిస్తుంది.
అన్ని రకాల బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లోకి మార్చేస్తే ‘ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్ (ఈఐఏ)’ ద్వారా బీమా పాలసీ తేలిగ్గా యాక్సెస్ అవుతుంది. పూర్తిగా కాగితం రహితం కావడంతోపాటు ఆన్ లైన్లో అందుబాటులో ఉండటం వల్ల ఒక్కోసారి డాక్యుమెంట్లు పోగొట్టుకున్నా తిరిగి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ డాక్యుమెంట్లతో పోలిస్తే.. ఈ-ఇన్సూరెన్స్ పత్రాలు కోల్పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పాలసీ డిటైల్స్, రెన్యూవల్ తేదీలు తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఇక ఇన్సూరెన్స్ పాలసీల అడ్రస్ మార్చాలన్నా, వివరాలు అప్ డేట్ చేయాలన్నా ఈ-ఇన్సూరెన్స్ తో చాలా తేలికవుతుంది. దీనికి తోడు పాలసీల డిజిటలైజేషన్ వల్ల ఇన్సూరెన్స్ సంస్థలకు, పాలసీదారుల మధ్య కమ్యూనికేషన్స్ మెరుగవుతాయి. ఫలితంగా క్లయిమ్లు సౌలభ్యంగా మారతాయి.