న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 147 రోజుల తర్వాత రోజువారీ కేసులు భారీగా తగ్గాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3,88,508 ఉన్నాయని.. 139 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.21శాతం ఉన్నాయని చెప్పింది. రికవరీ రేటు 97.45శాతానికి పెరిగిందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 41,511 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,19,98,158కు పెరిగింది. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 3,11,80,968 మంది బాధితులు కోలుకున్నారు. మరో 373 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,28,682కు పెరిగింది. మరో వైపు దేశంలో టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 51,45,00,268 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 2.36 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.87 తగ్గిందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 48.32 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.