న్యూఢిల్లీ : రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు బీకేయూ నేత రాకేశ్ తికాయిత్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు పలువురు ప్రముఖలను కలిసి మద్దతు కోరనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 12న టోక్యో ఒలిపింక్స్ పతక విజేత భజరంగ్ పూనియాను సొంత గ్రామంలో కలువనున్నారు. సెప్టెంబర్ 5న జరిగే కిసాన్ మహాపంచాయత్లో పాల్గొని, మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాను సైతం కలువనున్నారు. అయితే, భజరంగ్ పూనియా గతంలో రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపాడు.
ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ నేత ధర్మేంద్ర మాలిక్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఇందుకు రాకేశ్ తికాయిత్ సైతం నిరంతరం వివిధ రాష్ట్రాలకు వెళ్లి రైతులను కలుస్తున్నారని తెలిపారు. ఈ నెల 11న ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లో పర్యటిస్తారన్నారు. సెప్టెంబర్ 5న యునైటెడ్ ఫ్రంట్ మహాపంచాయత్ కార్యక్రమం ఉంటుందని, ఇందులో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేసేలా విజ్ఞప్తి చేస్తున్నారన్నారు.