తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టులో రెండుసార్లు గరుడ వాహనసేవ జరుగనుంది. గరుడ పంచమి, శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా మలయప్పస్వామి గరుడవాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.
ఈ నెల 13న గరుడ పంచమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి వారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ‘గరుడపంచమి’ పూజ చేస్తారని ప్రాశస్త్యం.
ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవ జరుగుతుంది. 22న శ్రావణ పౌర్ణమి సందర్భంగా సేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది.